
కూకట్పల్లి, వెలుగు: అకారణంగా తన భార్యని తిట్టాడనే కోపంతో ఒక యువకుడు కన్న తండ్రినే కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మూసాపేటలోని సఫ్దర్నగర్కు చెందిన ఎండీ ఇంతియాజ్(55) గతంలో ఆర్ఎంపీ డాక్టర్గా పని చేశాడు. బస్తీలో పక్క పక్క ఇళ్లల్లోనే ఇతని పెద్ద కొడుకు ఎండీ సలావుద్దీన్(26), చిన్న కొడుకు బురానుద్దీన్ ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే సలావుద్దీన్కి పెళ్లి అయింది. కాగా కొంత కాలంగా తాగుడుకు బానిసైన ఇంతియాజ్ మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. డైలీ తాగొచ్చి కుటుంబ సభ్యులను తిట్టేవాడు. ఆదివారం రాత్రి కూడా తాగి వచ్చిన ఇంతియాజ్ తన కోడలు మరియంని తిట్టాడు. ఈ విషయాన్ని ఆమె వెళ్లి భర్త సలావుద్దీన్కు చెప్పింది. దీంతో సలావుద్దీన్ తన తమ్ముడు బురానుద్దీన్తో కలిసి తండ్రి వద్దకు వెళ్లాడు. తన భార్యను ఎందుకు తిట్టావని నిలదీశాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో సలావుద్దీన్ సెంట్రింగ్ రాడ్ తీసుకుని తండ్రి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ను చిన్న కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.