భార్యని తిట్టాడని... తండ్రిని చంపిన కొడుకు

భార్యని తిట్టాడని... తండ్రిని చంపిన కొడుకు

కూకట్​పల్లి, వెలుగు: అకారణంగా తన భార్యని తిట్టాడనే కోపంతో ఒక యువకుడు కన్న తండ్రినే కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో  జరిగింది. మూసాపేటలోని సఫ్దర్​నగర్​కు చెందిన ఎండీ ఇంతియాజ్​(55) గతంలో ఆర్​ఎంపీ డాక్టర్​గా పని చేశాడు. బస్తీలో పక్క పక్క ఇళ్లల్లోనే ఇతని పెద్ద కొడుకు ఎండీ సలావుద్దీన్​(26), చిన్న కొడుకు బురానుద్దీన్​ ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే సలావుద్దీన్​కి పెళ్లి అయింది. కాగా కొంత కాలంగా తాగుడుకు  బానిసైన  ఇంతియాజ్ ​మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. డైలీ తాగొచ్చి కుటుంబ సభ్యులను తిట్టేవాడు. ఆదివారం రాత్రి కూడా తాగి వచ్చిన ఇంతియాజ్​ తన కోడలు మరియంని తిట్టాడు. ఈ విషయాన్ని ఆమె వెళ్లి భర్త సలావుద్దీన్​కు చెప్పింది. దీంతో సలావుద్దీన్​ తన తమ్ముడు బురానుద్దీన్​తో కలిసి  తండ్రి వద్దకు వెళ్లాడు. తన భార్యను ఎందుకు తిట్టావని నిలదీశాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో సలావుద్దీన్​ సెంట్రింగ్​ రాడ్​ తీసుకుని తండ్రి తలపై కొట్టాడు.  తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్​ను  చిన్న కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.