- స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు
- ఇంటర్ సీటు 6 లక్షల నుంచి పది లక్షల దాకా!
- -ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు
- రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు
- బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు
- ఫైర్సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతులు, హాస్టళ్లు
- ఫుడ్డు, బెడ్డు.. అన్నీ అధ్వాన్నమే!
- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్లీ మొదలైంది. ఇంటర్తోపాటే జేఈఈ, నీట్, ఎప్ సెట్ కోచింగ్ పేరిట మేనేజ్ మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని, పేరెంట్స్కు వల విసురుతున్నాయి. పదుల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేలకొద్దీ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వందల బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు రెండేండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా రూ.5 లక్షల నుంచి6 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్సేఫ్టీ మచ్చుకైనా లేని అపార్ట్మెంట్లలో కాలేజీలను నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
మూడోవంతు కార్పొరేట్ కాలేజీలే..
రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలున్నాయి. వీటిలో రెండు ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియెట్ మార్కెట్ను శాసిస్తున్నాయి. హైదరాబాద్, ఔటర్కు అటూ ఇటూ వందలకొద్దీ బ్రాంచీలు తెరిచి నిబంధనలకు
విరుద్ధంగా కాలేజీలను నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దాని కో ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లేగ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ. లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి. ఫైర్సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ఇలాంటివేవీ కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. వందలు, వేల మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చినా అడ్మిషన్ చేసుకొని, ఆ మేరకు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్ తెరిచేస్తున్నారు.
ఒకచోట పర్మిషన్ తీసుకొని, మరోచోట కాలేజీలు నిర్వహిస్తున్నారు. నలుగురు ఉండాల్సిన హాస్టల్రూముల్లో పది మందిని కుక్కుతున్నారు. ఒక్కో క్లాస్రూములో సగటున 40 మంది స్టూడెంట్లు మించరాదని నిబంధనలు చెప్తున్నా 60 మందికిపైనే ఉంచుతున్నారు. ప్రతి సెక్షన్లో పూర్, యావరేజ్, ఎబో యావరేజ్స్టూడెంట్లను ఉంచాలనేది నిబంధన. కానీ కార్పొరేట్ కాలేజీలు.. స్టూడెంట్లకు ముందుగా టెస్ట్పెట్టి, అందులో పర్ఫార్మెన్స్ ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేస్తున్నాయి. ర్యాంకులు వచ్చే అవకాశమున్న పిల్లలందరితో సెపరేట్బ్రాంచీలు పెట్టి వాళ్లపైనే కాన్సంట్రేషన్ చేస్తున్నాయి. వాళ్లకు మాత్రమే మంచి స్టాఫ్, మంచి మెటీరియల్, మంచి ఫుడ్ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాయి. వీరిలో ర్యాంకులు వచ్చేవాళ్లు పదుల సంఖ్యలో ఉండగా, మిగిలిన వేలమందికి ఎలాంటి ర్యాంకులు రావడం లేదు. ఇన్ని లక్షలు పెట్టినా కనీసం ఇంటర్ పాస్కాని వాళ్లు వేలల్లో ఉంటున్నారు. కానీ ఆఫీసర్లను మేనేజ్చేయడం వల్ల ఈ విషయాలేవీ బయటకు రావడం లేదు.
అడ్మిషన్లు మొదలైనయ్
హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, ఆదిభట్ల, విఠల్ వాడి, చిక్కడపల్లి, హైదర్ నగర్ తదితర ప్రాంతాలు కార్పొరేట్ కాలేజీలకు అడ్డాలుగా మారిపోయాయి. ఇప్పుడిప్పుడే జిల్లాలకూ విస్తరిస్తున్నాయి. టెన్త్ ఫలితాలు ఇంకా రిలీజ్ కాకున్నా ఇప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీలు 70 నుంచి80 శాతానికి పైగా అడ్మిషన్లు పూర్తిచేశాయి. జనవరి నుంచే స్కూళ్ల ద్వారా పేరెంట్స్ ఫోన్నంబర్లు సేకరించి, పీఆర్వోల ద్వారా అడ్మిషన్లు ప్రారంభించారు. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో కన్సెషన్ ఉంటుందని చెప్పి చేర్చుకుంటున్నారు.
రూ.10 వేల నుంచి రూ.లక్ష దాకా అడ్వాన్స్ తీసుకొని అడ్మిషన్ నంబర్లు ఇస్తున్నారు. అడ్మిషన్ నంబర్లతో పాటే ఆన్లైన్ క్లాస్ లింక్లు వాట్సాప్కు సెండ్ చేస్తున్నారు. నిజానికి మే31 దాకా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. కానీ, కార్పొరేట్ కాలేజీలు మార్చి నాలుగో వారం నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. టెన్త్ పరీక్షలు రాసిన స్టూడెంట్లకూ బ్రిడ్జికోర్సుల పేరుతో తరగతులు చెప్తున్నాయి. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్లు ఆధారాలతో సహా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా, ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు తీసుకోలేదు. దీంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏసీ కావాలంటే రూ.లక్ష అదనం
రెండేండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఏసీ క్యాంపస్ పేరిట పేరెంట్స్వద్ద అదనంగా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల దాకా గుంజుతున్నాయి. నిజానికి కాలేజీలు స్టార్ట్అయ్యేసరికే ఎండాకాలం అయిపోతుంది. ఆ తర్వాత వర్షాలు, అటుపై చలికాలంలో ఏసీల అవసరమే ఉండదు. కానీ ఐఐటీ, నీట్ ప్రిపేర్ కావాలంటే స్ట్రెస్బాగా ఉంటుందని, ఏసీ అయితే బాగా చదువుతారని మభ్యపెడ్తున్నారు. మెడికల్, యూనిఫామ్, దోబీ, స్టడీ మెటీరియల్పేరుతో మరో లక్ష దాకా గుంజుతున్నారు.
ఫస్టియర్ కు ఒక ఫీజు తీసుకుంటూ, సెకండియర్ కు మరో రూ.20వేల నుంచి రూ.50 వేలు పెంచేస్తున్నారు. హైదరాబాద్ లింగంపల్లి ఏరియాలోని ఓ కార్పొరేట్కాలేజీలో చేరిన స్టూడెంట్కు జేఈఈ స్పెషల్కోర్సు పేరుతో ఫస్ట్ ఇయర్ రూ.2.50 లక్షల ఫీజు, ఏసీ పేరుతో రూ.లక్ష, దోబీ, స్టడీ మెటీరియల్పేరుతో రూ.50వేల చొప్పున రూ.4 లక్షలు వసూలు చేశారు. ఇటీవల సెకండ్ఇయర్లో మరో రూ.50వేలు అదనంగా పెంచుతున్నట్టు చెప్పారు. ఇదేంటని అడిగితే సెకండ్ ఇయర్ కదా.. ప్రాక్టికల్స్ ఉంటాయని, అదనంగా టెస్టులు కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో చేసేదిలేక అడిగినంత చెల్లించాల్సి వచ్చిందని సదరు పేరెంట్స్ వాపోయారు.
ఫీజులను నియంత్రించాలి
కార్పొరేట్ కాలేజీల్లో మినిమం ఫెసిలిటీస్ లేకున్నా ఐఐటీ, మెడిసిన్ కోచింగ్ ల పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్డగోలుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నడిపిస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని, కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలి.
-– నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
కార్పొరేట్ కాలేజీల్లో వివిధ పేర్లతో అక్రమంగా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి, వీటిని నియంత్రించాలి. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డుకు నియంత్రణ లేదు. ఒకే బ్రాండ్ పేరుతో అనేక కాలేజీలు నిర్వహిస్తున్నారు. అలాంటి కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఝాన్సీ, ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ
మా కొడుకును హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించినం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సౌలత్లు ఉన్నయి, చదువు మంచిగా ఉంటదని చెప్పిన్రు. రూ.3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నరు. కానీ అక్కడ పిల్లలకు సరైన సౌలత్లు లేవు. ఒక్కో రూమ్ లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నరు. వాష్ రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది. ఫుడ్డు కూడా సక్కగా పెడ్తలేరట. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటల ముచ్చటే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకుని పైసలు గుంజుతున్నరు. ఇసొంటి కాలేజీల ఎందుకు చేర్పించిన అని ఇప్పుడు బాధపడుతున్న.
- బరపటి మారుతి,
శ్రీరాంపూర్ కాలనీ, మంచిర్యాల జిల్లా
కోటా రాజస్థాన్పేరుతో కొత్త దోపిడీ
నీట్, ఐఐటీ కోచింగ్లకు, ర్యాంకులకు కోటా రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరతీశాయి. కోటా రాజస్థాన్ నుంచి స్టాఫ్ను తెప్పిస్తున్నామని, ర్యాంకులు గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటూ లక్షలకు లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఓ కార్పొరేట్ కాలేజీ రెండేండ్ల కింద కోటా రాజస్థాన్ పేరుతో కొత్త గా ఐఐటీ బ్రాంచి తెరిచింది.
నార్త్ నుంచి కొంతమంది లెక్చరర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తోంది. కానీ వాళ్లు కేవలం హిందీ, వచ్చీరాని ఇంగ్లిష్లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. అయినా.. ఇప్పటివరకు సదరు కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాదు, కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కడా ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లయింట్ వస్తున్నాయి.