టికెట్​ రేసులో ముగ్గురు... జుక్కల్ ​కాంగ్రెస్​ లో పోటాపోటీ

టికెట్​ రేసులో ముగ్గురు... జుక్కల్ ​కాంగ్రెస్​ లో పోటాపోటీ
  • పోటీ​పై ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే 
  • టికెట్​ దక్కుతుందనే ఆశలో మరో ఇద్దరు నేతలు
  • క్యాడర్​ను ఆకట్టుకునేందుకు ఎవరికివారే ప్రయత్నాలు

కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ కంచుకోటగా పేరున్న జుక్కల్​నియోజకర్గం నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు ముగ్గురు నేతలు సై అంటున్నారు. ఎస్సీ రిజర్వ్​డ్​ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత ​మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఒకరు ఎన్ఆర్ఐ కాగా, మరొకరు మాజీ డీసీసీ. 

తనకే టికెట్​దక్కుతుందన్న ధీమాతో మాజీ ఎమ్మెలేకు పోటీగా మరో ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తుండడం ఇక్కడి పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ముగ్గురు నేతలు ఎవరికివారే నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

సానుభూతి కలిసి వస్తుందని..

జుక్కల్​ నియోజకవర్గ కాంగ్రెస్​కు మాజీ ఎమ్మెల్యే సౌదగర్​ గంగారం పెద్ద దిక్కుగా ఉన్నారు.ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈయన జుక్కల్​ నుంచి మొత్తం ఏడుసార్లు పోటీచేసి 4  పర్యాయాలు విజయంగా సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్​షిండే చేతిలో ఓడిపోయారు. సీనియర్​ నేత కావడం, వరుసగా రెండుసార్లు ఓడిన సానుభూతి తనకు కలిసి వస్తుందనే ఉద్దేశంలో ఉన్నారు.  

రంగంలోకి మరో ఇద్దరు నేతలు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్​గా పనిచేసిన గడుగు గంగాధర్ జుక్కల్​ సీటుపై కన్నేశారు. కొద్ది నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇక్కడ ఆఫీస్​ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గానికి పక్కనే ఉండే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీకాంత్​రావు కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. 

9 నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్​ను, స్థానికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఇద్దరు నేతలు నియోజకవర్గానికి రావడం, వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా ఇటీవల యాక్టివ్​అయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తన క్యాడర్​ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

జోడో యాత్ర, కర్నాటక గెలుపుతో జోష్​

గతేడాది నవంబర్​లో కాంగ్రెస్​ యువనేత రాహుల్​గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర మన స్టేట్​ గుండా సాగింది. మన స్టేట్​లో కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గంలో ముగిసింది. ఇక్కడి నుంచి యాత్ర మహారాష్ట్రలోకి ఎంట్రీ అయ్యింది. స్టేట్​లో యాత్ర ముగింపు సందర్భంగా జుక్కల్​నియోజకవర్గంలోని మద్నూర్​ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ సభ సక్సెస్​ కావడంతో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో జోష్​ పెరిగింది. నియోజకవర్గానికి బార్డర్​గా ఉన్న కర్నాటక లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించడంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుందని  నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పోటీకి ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు.