- గదులపై భారీగా తగ్గిన అద్దె
- ఐహెచ్ఎం ప్రిన్సిపాల్ సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఆతిథ్య రంగానికి జీఎస్టీ 2.0 బూస్ట్లా పని చేయనుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం) ప్రిన్సిపాల్ సంజయ్ ఠాకూర్ తెలిపారు. హస్పిటాలిటీ, టూరిజం రంగం ప్రస్తుతం కీలక మలుపులో ఉందన్నారు. జీఎస్టీ 2.0 గత కొన్ని సంవత్సరాల్లో అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణలలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
‘‘ఈ కొత్త విధానంలో ఒక్క రోజుకి రూ.7,500 లోపు ఉన్న హోటల్ గది అద్దెలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లేకుండా కేవలం ఐదు శాతం జీఎస్టీ విధిస్తారు. ఇంతకుముందు ఇది 12 శాతంగా ఉండేది. రూ.7,500 పైగా ఉన్న అద్దెలపై మాత్రం 18 శాతం జీఎస్టీ (ఐటీసీతో) కొనసాగుతుంది. ఈ సరళమైన పన్ను విధానం భారతదేశాన్ని ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న పర్యాటక మార్కెట్లలో ఒకటిగా నిలుపుతుంది.
ప్రపంచ పర్యాటక మండలి 2024 ప్రకారం ప్రస్తుతం ఈ రంగం దేశీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 9.2 శాతం వాటా కలిగి ఉంది. సుమారు 3.9 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తోంది. జీఎస్టీ 2.0 వల్ల దేశ, విదేశీ పర్యాటకులకు చవకగా వసతి అందుబాటులోకి వచ్చింది. రూ.7,500 కంటే తక్కువ అద్దె గదులపై పన్ను తగ్గింపుల వల్ల కొన్ని వర్గాల్లో ఒక్క రాత్రికి రూ.490 వరకు ఆదా అవుతుంది. భారతదేశంలోని సుమారు 90 శాతం హోటళ్లు ఈ ధర పరిధిలో ఉన్నందున ఈ సంస్కరణ బడ్జెట్ హోటళ్లకు ఎంతో మేలు చేస్తుంది ”అని ఆయన వివరించారు.
