సిల్హెట్: వరుస విజయాలతో జోష్ మీదున్న ఇండియా విమెన్స్ టీమ్.. ఆసియా కప్ టైటిల్ ఫైట్కు రెడీ అయ్యింది. శనివారం జరిగే ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు టోర్నీ జరిగితే..అన్నిసార్లు ఫైనల్స్కు అర్హత సాధించిన ఇండియా..ఒకే ఒక్కసారి 2018లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కూడా కప్ను చేజిక్కించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు మెగా ఈవెంట్లో నాలుగుసార్లు ఇండియా చేతిలోనే ఓడి రన్నరప్గా నిలిచిన లంకేయులు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు. సెమీస్లో పాక్పై చూపెట్టిన సమష్టి పోరాటాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు. అయితే బలం, ఫామ్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్లో ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది.
షెఫాలీపైనే భారం..
ఫైనల్ ఫైట్ కోసం టీమిండియా ఫైనల్ ఎలెవన్లో పెద్దగా మార్పులు చేయడం లేదు. కానీ సిల్హెట్ పిచ్ నెమ్మదిగా ఉండటంతో స్ట్రోక్స్ ఆడే అవకాశం ఎక్కువగా స్మృతి మంధాన, హర్మన్ప్రీత్పైనే ఉంటుంది. గత మ్యాచ్ల్లో వీళ్ల సహకారం పెద్దగా లేదు. కాబట్టి ఈ మ్యాచ్లోనైనా వీళ్లు బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. నాలుగు మ్యాచ్ల్లో హర్మన్ 81 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనింగ్లో 18 ఏళ్ల షెఫాలీ (161 రన్స్, 3 వికెట్స్), మిడిలార్డర్లో 22 ఏళ్ల రొడ్రిగ్స్ (215 రన్స్), 25 ఏళ్ల దీప్తి శర్మ (94 రన్స్, 13 వికెట్లు) సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. ఈ త్రయం ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఇండియా విజయం సులువైనట్లే. రిచా ఘోష్, పూజా ఇంకాస్త మెరవాల్సి ఉంది. బౌలింగ్లో స్పిన్ త్రయం దీప్తి, రాజేశ్వరి, స్నేహ్ రాణా మ్యాజిక్పైనే ఇండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. పేసర్లు రేణుకా సింగ్, మేఘనా సింగ్ కూడా అండగా నిలిస్తే బౌలింగ్లోనూ ఇబ్బందులు లేనట్లే.
ఆటపట్టు ఆడితే..
శ్రీలంక కూడా ఈమ్యాచ్ కోసం కొత్త ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఇండియా బ్యాటర్ల ఆధిపత్యానికి ఆరంభంలోనే అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బౌలింగ్ను బలోపేతం చేసుకుంటున్నది. అయితే ఒషాది రణసింఘే, అచిని కులసురియా వికెట్లు తీయడంలో విఫలమవుతుండటం ఆందోళన కలిగించే అంశం. సుగంధికా, కవిషా, మాల్షా గాడిలో పడాల్సి ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇనోకా రణవీర (12 వికెట్లు)పైనే ఎక్కువ భారం ఉంది. ఇక బ్యాటింగ్లో అనుష్క, హర్షిత మాధవి (201 రన్స్), నీలాక్షి డిసిల్వా (124 రన్స్) ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. చమరి ఆటపట్టు (96 రన్స్) మెరిస్తే లంక బ్యాటింగ్ కష్టాలు తీరినట్లే. లీగ్ దశలో ఇండియా చేతిలో ఓడిన లంకేయులు..దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత ఈజీ కాకపోయినా.. గత ఎడిషన్లో బంగ్లాదేశ్ చేసిన సంచలనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నారు.