
- బ్యాటింగ్ మెరుగవడంపైనే దృష్టి
- మ్యాచ్కు వాన ముప్పు
టీ20 వరల్డ్ కప్లో వరుసగా రెండు విజయాల తర్వాత గత పోరులో సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న టీమిండియా ఆ ఓటమిని మరిచి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. సూపర్–12, గ్రూప్2లో భాగంగా బుధవారం జరిగే తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో అమీతుమీకి రెడీ అయింది. గెలిస్తే సెమీఫైనల్ బెర్తు ఊరిస్తుండగా... గత పోరులో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని ముందంజ వేయాలని ఇండియా ఆశిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. స్టార్లతో నిండిన మన బ్యాటింగ్ ఆర్డర్ ఈ టోర్నీలో నిరాశ పరుస్తోంది. పెర్త్లో గత పోరులో బౌన్సీ వికెట్పై బ్యాటర్లు బోల్తా పడ్డారు. రోహిత్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా పుల్ షాట్లకు ట్రై చేసి వికెట్లు పారేసుకుంటే.. రాహుల్, దీపక్ హుడా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ను బయటపెట్టారు. మరీ ముఖ్యంగా 3 ఇన్నింగ్స్ల్లో 22 రన్స్ మాత్రమే చేసిన రాహుల్పై అన్నివైపుల నుంచి విమర్శల దాడి ఎక్కువైంది. రిషబ్ పంత్ రూపంలో ఓపెనింగ్ చేసే బ్యాటర్ అందుబాటులో ఉన్నప్పుడు అతడిని పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఏముందని మాజీలు ప్రశ్నిస్తున్నారు. కానీ, కేఎల్ సత్తాపై హెడ్ కోచ్ ద్రవిడ్ పూర్తి నమ్మకం ఉంచాడు. దాన్ని నిలబెట్టుకునేందుకు బంగ్లాపై చెలరేగి రాహుల్ ఫామ్ అందుకుంటాడేమో చూడాలి. నెదర్లాండ్స్తో ఫిఫ్టీ కొట్టిన కెప్టెన్ రోహిత్ మరోసారి బ్యాట్ ఝుళిపిస్తే ఓపెనింగ్ కష్టాలు తప్పుతాయి. విరాట్ కోహ్లీ ఫామ్లో ఉండగా, వరుసగా రెండు ఫిఫ్టీలతో సూర్య టచ్లోకి రావడంతో మిడిలార్డర్ బలోపేతం అయింది. రాహుల్ ప్లేస్లో కాకున్నా దినేశ్ కార్తీక్ స్థానంలో పంత్ తుది జట్టులోకి వచ్చే చాన్సుంది. అడిలైడ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎక్స్ట్రా బ్యాటర్గా దీపక్ హుడాను కొనసాగించొచ్చు. బౌలింగ్లో జట్టుకు ఇబ్బందులు లేవు. బంగ్లా టీమ్లో నలుగురు లెఫ్టాండ్ బ్యాటర్లున్నారు. పైగా, ఆ టీమ్ ప్లేయర్లు లెగ్ స్పిన్ను సరిగ్గా ఆడలేరు కాబట్టి అశ్విన్ ప్లేస్లో చహల్ను తీసుకుంటే ఫలితం ఉండొచ్చు. అయితే, మ్యాచ్కు వాన ముప్పు ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం భారీ వర్షం రావడంతో ఇండియా ప్లేయర్లు ఇండోర్లో ప్రాక్టీస్ చేశారు. బుధవారం మ్యాచ్ టైమ్లో వర్షం వచ్చే అవకాశం ఉంది.
బంగ్లా బలమెంత?
టీ20 వరల్డ్ కప్లో చివరగా ఇండియా– బంగ్లా 2016లో తలపడ్డ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ధోనీ మాస్టర్ మైండ్తో ఇండియా గట్టెక్కడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం షార్ట్ ఫార్మాట్లో బంగ్లా అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్ల్లో చిన్న జట్లు నెదర్లాండ్స్, జింబాబ్వేను ఓడించి 4 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ రేసులోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకూడదని బంగ్లా భావిస్తోంది. కానీ, ఇండియాను ఓడించడం అంత ఈజీ కాదని ఆ జట్టుకు తెలుసు. పైగా, ఆసీస్ పిచ్లపై ఆ టీమ్ బ్యాటర్లు తడబడుతున్నారు. మూడు మ్యాచ్ల్లో ఓపెనర్ శాంటో ఒక్కడే 100 పైచిలుకు రన్స్ చేశాడు. కెప్టెన్ షకీబ్ పేలవ ఫామ్లో ఉన్నాడు. మిడిలార్డర్లో అఫిఫ్, మొసాదెక్ కాస్త ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే, ఇండియా పేస్ త్రయం షమీ, భువీ, అర్ష్దీప్ను వీళ్లు ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి. బౌలింగ్లో తస్కిన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇండియా బ్యాటర్లు అతని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, సూర్య, పంత్/కార్తీక్ (కీపర్), హుడా/అక్షర్, పాండ్యా, అశ్విన్/చహల్, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్.
బంగ్లాదేశ్: సౌమ్య సర్కార్, నజ్ముల్ శాంటో, లిటన్, షకీబ్ (కెప్టెన్) అఫిఫ్, నురుల్ (కీపర్), మొసాదెక్, యాసిర్, తస్కిన్, ముస్తాఫిజుర్, హసన్ మహ్మూద్.