జర్నలిస్టులకు టోల్ ఫీజును మినహాయించాలి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

జర్నలిస్టులకు టోల్ ఫీజును మినహాయించాలి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

ఎన్ హెచ్ఏఐ ఆర్వోను కోరిన టీడబ్ల్యూజేఎఫ్ 

హైదరాబాద్, వెలుగు : జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి  మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య కోరారు. శుక్రవారం ఈ అంశంపై  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ను బంజారాహిల్స్ లోని ఆయన ఆఫీస్​లో కలిసి వినతిపత్రం అందచేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్న జర్నలిస్టులపై టోల్ గేట్ ఫీజు వల్ల ఆర్థిక భారం పడుతోందన్నారు. న్యూస్ కవరేజీ కోసం హైవేలపై ప్రయాణించే జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అక్రెడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యం ఉన్నప్పటికీ రాయితీలో టోల్ ఫీజు పడుతోందని, దీని వల్ల మూడోవంతు రాయితీ తగ్గిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. అధికారులు, ప్రజాప్రతినిధుల మాదిరిగానే జర్నలిస్టుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కృష్ణ ప్రసాద్  స్పందిస్తూ...ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ఈ విషయాన్ని తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్  పిల్లి రాంచందర్, జి. రఘు, హెచ్ యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.