- పెరిగిన స్టీల్, అల్యూమినియం, ఇతర కమోడిటీల రేట్లు
- వెంటాడుతున్న చిప్ షార్టేజ్, చైనాలో మళ్లీ పెరుగుతున్న
- కరోనా కేసులే కారణం
- ఇప్పటికే రేట్ల హైక్ను ప్రకటించిన టాటా మోటార్స్, టయోటా, ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్
బిజినెస్ డెస్క్, వెలుగు: వచ్చే నెల నుంచి టాప్ కారు మోడల్స్ రేట్లు పెరగనున్నాయి. కార్ల తయారీ కంపెనీలయిన టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్లు ఏప్రిల్ 1 నుంచి వివిధ కారు మోడల్స్ రేట్లను పెంచుతామని ప్రకటించాయి. మారుతి కూడా రేట్లను పెంపు ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభంతో స్టీల్, అల్యూమినియం రేట్లు భారీగా పెరిగాయి. మిగిలిన రామెటీరియల్స్ ధరలు కూడా పెరిగాయని, ఇన్ఫుట్ కాస్ట్ పెరగడంతో రేట్లను పెంచుతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఆటోమోటివ్ ఇండస్ట్రీని చిప్ల కొరత వెంటాడుతున్న విషయం తెలిసిందే. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో సప్లయ్ చెయిన్లో సమస్యలు తలెత్తుతున్నాయి.
వచ్చే నెల నుంచి కార్ల రేట్లను పెంచుతున్న కంపెనీలు ఇవే..
టాటా మోటార్స్..
టాటా మోటార్స్ ఇప్పటికే టాటా నెక్సాన్ రేటును రూ. 25 వేలు పెంచింది. కమర్షియల్ వెహికల్స్ రేట్లను కూడా 2 నుంచి 2.5 శాతం మేర పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ఈ పెంచిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మోడల్, వేరియంట్ బట్టి రేట్ల పెంపులో తేడా ఉంటుందని కంపెనీ వివరించింది.
టయోటా కిర్లోస్కర్..
అన్ని మోడల్స్ రేట్లను టయోటా కిర్లోస్కర్ పెంచనుంది. వచ్చె నెల 1 నుంచి తమ కార్ల రేట్లను 4 శాతం వరకు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో రేట్లను పెంచాల్సి వస్తోందని వివరించింది. ఫార్చునర్, ఇన్నొవా క్రిస్టా వంటి మోడల్స్ను కంపెనీ అమ్ముతోంది.
బీఎండబ్ల్యూ..
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ 3.5 శాతం వరకు రేట్లను పెంచుతామని ప్రకటించింది. ఏప్రిల్1 నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయి. రవాణా ఖర్చులు పెరగడం, రామెటీరియల్స్ ధరలు ఎక్కువవ్వడంతో అన్ని మోడల్స్ రేట్లను పెంచాలని బీఎండబ్ల్యూ చూస్తోంది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కౌప్, బీఎండబ్ల్యూ3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్ లిమౌజన్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ, బీఎండబ్ల్యూ 5సిరీస్, బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టూరిస్మో, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5, ఎక్స్7, మిని కంట్రీమ్యాన్ మోడల్స్ను కంపెనీ లోకల్గానే తయారు చేస్తోంది. వీటి రేట్లు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి.
మెర్సిడెస్ బెంజ్..
మెర్సిడెస్ బెంజ్ కూడా వివిధ మోడల్స్ రేట్లను పెంచుతామని ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి వివిధ మోడల్స్ రేట్లు 3 శాతం వరకు పెరుగతాయని కంపెనీ పేర్కొంది. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో రేట్లను పెంచుతున్నామని వివరించింది. కంపెనీ కార్ల రేట్లు వచ్చే నెల నుంచి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పెరగనున్నాయి. మెర్సిడెస్ అమ్ముతున్న ఏ200 లిమోజిన్ ధర ఏప్రిల్ 1 నుంచి రూ. 42 లక్షల నుంచి స్టార్ట్ కానుంది.
ఆడి..
మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి కూడా కార్ల రేట్లను పెంచుతామని ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి వివిధ మోడల్స్ రేట్లను 3 శాతం మేర పెంచుతా మని పేర్కొంది. ఇన్పుట్ కాస్ట్ పెరగడం, ఫారెక్స్ (డాలర్ మారకంలో రూపాయి విలువ) రేట్స్ మారడంతో కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని ఆడి ప్రకటించింది. ప్రస్తుతం ఆడి లోకల్గా ఏ4, ఏ6, ఏ8 ఎల్, క్యూ2, క్యూ5, క్యూ8, ఎస్5 స్పోర్ట్బ్యాక్ ఆర్ఎస్ క్యూ8, క్యూ7 ఎస్యూవీ మోడల్స్ను లోకల్గా అమ్ముతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఈ–ట్రాన్–50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడల్స్ను తీసుకొచ్చింది.