
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, భూ సమస్యలు, వైద్యవిధాన పరిషత్ స్టాఫ్ నర్సులు, విద్యుత్ శాఖలో లైన్మెన్గా ఎంపికైన జూనియర్ లైన్మెన్లు దరఖాస్తులు ఇచ్చారు. నోడల్ అధికారి దివ్య పర్యవేక్షణలో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 1,267 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ప్రమోషన్ లేదు..హెల్త్ కార్డు లేదు
వైద్య విధాన పరిషత్లో సుమారు 1,600 మంది స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మంది 317 జీవోతో స్థానికత కోల్పోతున్నామని వ్యతిరేకిస్తున్నారు. మిగతా 1,400 మంది జీవోను అమలు చేయాలని కోరుతున్నారు. 1999 నుంచి స్టాఫ్నర్సులుగా చేస్తున్నామని,317 జీవో అమలు కానందున పదోన్నతి కోల్పోయామన్నారు. తమకు ట్రెజరీ నుంచి 010 పద్దు కింద జీతాలు రావాలని వైద్యవిధాన పరిషత్నర్సులు సునీత, సరోజ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం హయాంలో మంత్రుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగామని, అయినా ఫలితం దక్కలేదన్నారు. 25 ఏండ్లుగా జాబ్ చేస్తున్నామని, రిటైర్మెంట్ వయస్సు వచ్చినా పదోన్నతి దక్కకపోవడం అన్యాయమన్నారు.
పోల్ టెస్ట్ పాసైనా జాబ్ లు ఇవ్వట్లేదు
విద్యుత్ శాఖలో పోల్టెస్టు పాసైనా జాబ్ ఇవ్వడం లేదంటూ జూనియర్ లైన్మెన్లు ఆరోపించారు. మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నా.. తమను తీసుకోకుండా రిటైర్డ్ ఉద్యోగులను డ్యూటీలోకి తీసుకుంటున్నారని శ్రీశైలం, శ్రీనివాస్, అనిల్, నగేశ్పేర్కొన్నారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందన్నారు.