సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

గచ్చిబౌలి, వెలుగు: ఈ నెల 31న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. 

ట్యాక్సీ, క్యాబ్​ డ్రైవర్లు రూల్స్​ ఫాలో కావాలే..

31న అర్ధరాత్రి క్యాబ్​లు, ఆటోలు, ట్యాక్సీలు డ్రైవింగ్​ చేసే డ్రైవర్లు యునిఫాం వేసుకొని, వెహికల్స్​కు సంబంధించిన డాక్యుమెంట్స్​ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. రూల్స్​ బ్రేక్​ చేసిన, పబ్లిక్​ వద్ద ఎక్కువ డబ్బు వసూలు చేసినా  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. 

పబ్​లు..  బార్​లలో..

పబ్​లు, బార్ల మేనేజ్​మెంట్లు కచ్చితంగా రూల్స్​ పాటించాలి. పబ్​లు, బార్లకు వచ్చే కస్టమర్లకు పరిమితికి మించి లిక్కర్ అమ్మకూడదు. అదే విధంగా మద్యం సేవించిన కస్టమర్లను డ్రైవింగ్​ చేయకుండా ఆల్టర్నేట్​ అరేంజ్​మెంట్స్​ చేయాలి.

డ్రంకెన్ డ్రైవ్..

సైబరాబాద్​ లిమిట్స్​లో  డిసెంబర్​ 31న అన్నీ రూట్లలో డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. వెహికల్​ డ్రైవ్​ చేసే వ్యక్తి  వెహికిల్​కు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసు అధికారులకు చూపించి సహకరించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ చేసి పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతామని తెలిపారు.  దీంతో పాటు రూ. 10 వేలు లేదా 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు.  ట్రాఫిక్​ రూల్స్​ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. 

ఈవెంట్ ఆర్గనైజర్స్ తో డీసీపీ సమావేశం

కంటోన్మెంట్​: న్యూ ఇయర్ వేడుకల్లో  రూల్స్  పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని నార్త్​జోన్​ డీసీపీ చందనా దీప్తి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె సికింద్రాబాద్​ కార్కానాలో పబ్​లు, క్లబ్​లు, హోటల్స్​ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్​వేడుకలకు వచ్చే వారికిపార్కింగ్​ సదుపాయాలు ఆయా ఆర్గనైజర్లుఏర్పాటు చేయాలని, టైమింగ్​ విధిగా పాటించాలని,వేడుకల్లో పాల్గొన్నవారికి తిరిగి ఇంటికి చేర్చే వరకు నిర్వాహకులు బాధ్యత తీసుకోవాల్సిఉంటుందని పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారు మద్యం తాగి ఉంటే వారి  వెహికల్స్ నడిపేందుకు నిర్వాహకులే ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో నార్త్​జోన్​ అడిషనల్​ డీసీపీ యోగేష్​ గౌతమ్​, ఏసీపీలు రమేశ్, సుధీర్​,రంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..

నెహ్రూ ఓఆర్ఆర్​పై  కేవలం ఎయిర్​పోర్టుకు వెళ్లే వెహికల్స్  మినహా మిగిలిన వాటికి అనుమతి లేదు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వరకు ఉన్న పీవీఎన్ ఆర్​ ఎక్స్​ప్రెస్​ వే పై ఎయిర్​పోర్టుకు వెళ్లే వెహికల్స్ కు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు.

 ఫ్లై ఓవర్లు బంద్​...

సైబరాబాద్​ పరిధిలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు క్లోజ్​చేయనున్నారు.  శిల్పా లేఅవుట్​ ఫ్లై ఓవర్​, గచ్చిబౌలి ఫ్లై ఓవర్​, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్​ 1,2, షేక్​పేట, మైండ్​స్పేస్​, రోడ్​ నెం.45 ఫ్లై ఓవర్​, దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి,  సైబర్​ టవర్స్​ ఫ్లై ఓవర్​,  జేఎన్టీయూ ఫ్లై ఓవర్, కైత్లాపూర్​ ఫ్లైఓవర్​, బాబు జగ్జీవన్​ రాం ఫ్లైఓవర్​(బాలానగర్​)ను  క్లోజ్ చేయనున్నారు.​ ఈ రూట్లలో ట్రావెల్​ చేసే వెహికల్స్​ను, వాకర్స్ ను ఫ్లై ఓవర్ల పైకి అనుమతించరు.