- హైదరాబాదీల్లో 71 శాతం మంది ట్రావెల్ చేయాలనుకుంటున్నరు
- జమ్మూ, కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, గోవాలే టాప్ డెస్టినేషన్లు
- ఇంటర్నేషనల్గా దుబాయ్, టర్కీ, రష్యాలకు వెళ్లేందుకు ఆసక్తి
- థామస్ కుక్ రిపోర్ట్లో వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: ట్రావెల్ ఇండస్ట్రీ పుంజుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం ఈ ఇండస్ట్రీకి పెద్ద ప్లస్గా మారింది. జనాలు కూడా ట్రావెల్ చేయడానికి వెనకడుగు వేయడం లేదు. థామస్ కుక్ వంటి ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కరోనా టెస్ట్ రిపోర్ట్లు ఉంటే తప్ప ట్రావెల్ చేయడానికి అనుమతిచ్చేవారు కాదు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. డొమెస్టిక్గా ఎక్కడికైన ట్రావెల్ చేయడానికి ఎటువంటి టెస్ట్ రిపోర్ట్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కరోనా ముందు లానే టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేస్తే సరిపోతుంది. హైదరాబాద్లో ట్రావెల్ ట్రెండ్స్పై థామస్ కుక్ సర్వే చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది ఈ ఏడాది ట్రావెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా పుంజుకుంటున్నాయి. చాలా దేశాలు కరోనా రిస్ట్రిక్షన్లు తగ్గిస్తున్నాయి లేదా తొలగిస్తున్నాయి. కిందటి వారం వరకు యూకే వెళ్లిన వారు 10 రోజులు పాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఈ రూల్ను తొలగించింది. టూరిస్ట్లకు వెల్కమ్ చెబుతోంది. రష్యా, టర్కీ వంటి చాలా దేశాలు టూరిస్ట్ల కోసం ఓపెన్ అయ్యాయి. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లను కొన్ని దేశాలు అనుమతిస్తుండగా, వ్యాక్సిన్ వేసుకోకపోయినా కొన్ని దేశాలు టూరిస్ట్లకు పర్మిషన్స్ ఇస్తున్నాయని థామస్ కుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కన్నా పేర్కొన్నారు. టర్కీ, రష్యా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లడానికి హైదరాబాదీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. దుబాయ్ ఎక్స్పో స్టార్ట్ కానుండడంతో ఈ దేశానికి వెళ్లడానికి ఎక్కువ బుకింగ్స్ అయ్యాయని అన్నారు. డొమెస్టిక్గా చూస్తే జమ్మూ, కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, గోవాలకు వెళ్లడానికి హైదరాబాదీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఈ సర్వే ప్రకారం, ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తామని 55 శాతం మంది, ఫ్రెండ్స్ లేదా కొలిగ్స్తో ట్రావెల్ చేస్తామని 20 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 20 శాతం మంది తమ స్పౌజ్తో ట్రావెల్ చేస్తామని, 5 శాతం మంది సోలోగా ట్రావెల్ చేస్తామని తెలిపారు.
వీకెండ్ ప్లాన్స్..స్టేకేషన్
కరోనా ప్రభావం ఎక్కువగా ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీపైనే పడిందని చెప్పాలి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు టూరిస్ట్ల కోసం ఓపెన్ కాలేదు. ఈ ఇండస్ట్రీ కరోనా ముందు స్థాయిలకు చేరుకోవడానికి ఇంకో మూడు–నాలుగేళ్లయినా పడుతుందని అంచనా. కానీ, కరోనా టైమ్తో పోలిస్తే మాత్రం ట్రావెల్ ఇండస్ట్రీ రీబౌండ్ అయ్యిందని ఎనలిస్టులు చెబుతున్నారు. చాలా మంది లాంగ్ డ్రైవ్లకు వెళుతున్నారు. ఫ్యామిలీస్ కూడా వీకెండ్స్లో టూర్స్ను ప్లాన్స్ చేసుకుంటున్నాయి. థామస్ కుక్ రిపోర్ట్ ప్రకారం, వీకెండ్ ప్యాకేజిలు, స్టేకేషన్లు పెరుగుతున్నాయి. వీకెండ్లో ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలనుకునే వారు వీకెండ్ ప్యాకేజీలను తీసుకుంటారు. కొత్తగా స్టేకేషన్లు కూడా పాపులరవుతున్నాయి. అంటే వర్క్ ప్రెజర్ను తగ్గించుకోవడానికి, అదే సిటీలో లేదా ఇతర సిటీలకు వెళ్లి హోటల్స్లో దిగి అక్కడే కొన్ని రోజులు పాటు గడుపుతారు. తర్వాత తిరిగొస్తారు. ప్రస్తుతం ఇలాంటి కల్చర్ కూడా పెరుగుతోంది. కరోనా టైమ్లో ట్రావెల్ చేయలేని వారు, ఇప్పుడు రిస్ట్రిక్షన్లు తొలగిపోవడంతో ట్రావెల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రావెల్స్ను ‘రివేంజ్ ట్రావెల్స్’ అని పిలుస్తున్నారు.
ట్రావెల్స్కు ఫుల్ డిమాండ్: థామస్ కుక్
కరోనా రిస్ట్రిక్షన్లు తొలగిపోవడంతో ట్రావెల్ డిమాండ్ పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా ప్రకటించింది. కరోనా ముందు స్థాయిల్లో (2019, సెప్టెంబర్ డేటా లో) 55 శాతం రికవర్ అయ్యామని పేర్కొంది. కేవలం డొమెస్టిక్ ట్రావెల్స్ చూస్తే 3 రెట్లు ఎక్కువ గ్రోత్ సాధించామని ప్రకటించింది. అదే ఆగస్ట్తో పోలిస్తే సెప్టెంబర్లో 65 శాతం ఎక్కువ డిమాండ్ను చూశామని పేర్కొంది. థామస్ కుక్కు దేశంలో 125 అవుట్లెట్లు ఉన్నాయి. ఇందులో 75 అవుట్లెట్లను ఫ్రాంఛైజీ మోడల్లో నడుపుతోంది.
తెలంగాణలోని కస్టమర్లు ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 75 % మంది కొత్త ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారు. దేశంలోని కొన్ని ప్రదేశాలు, మాల్దీవులు టాప్ డెస్టినేషన్లుగా ఉన్నాయి. యూరప్, టర్కీ, దుబాయ్ ఎక్స్పో లకు వెళ్లేందుకు ఫ్యామిలీస్, కపుల్స్, స్టూడెంట్లు ఆసక్తి చూపిస్తున్నారు. - సంతోష్ కన్నా, థామస్ కుక్ (ఇండియా) వైస్ ప్రెసిడెంట్.