ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్ట్, రిమాండ్...ఆదిలాబాద్ పోలీసుల అదుపులో నిందితులు

ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్ట్, రిమాండ్...ఆదిలాబాద్ పోలీసుల అదుపులో నిందితులు

ఆదిలాబాద్, వెలుగు: దారి దోపిడీ కేసులో ముగ్గురు దొంగలను అరెస్ట్​ చేసి, రిమాండ్​కుపంపినట్లు ఆదిలాబాద్  డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్  పట్టణానికి చెందిన వికాస్  మోజే ఓ వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నారు. 

ఈ నెల7న ఇచ్చోడ పట్టణానికి వెళ్లి అక్కడ డబ్బులు తీసుకొని అదిలాబాద్​కు వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్  శివారులోని దేవాపూర్  చెక్ పోస్ట్  దాటిన తరువాత అటకాయించి దాడి చేశారు. రూ.4.15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బాధితుడు పారిపోతున్న నిందితుల వాహనాన్ని వెంబడించి వారి ముఖాలు కనిపించేలా వీడియో తీసి పోలీసులకు అప్పగించాడు. 

పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు జాదవ్  అంకుశ్, ముండే సచ్చిదానంద్, కేంద్రే శంకర్ ను అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రాణాలకు తెగించి నిందితులను వెంబడించి వారి ముఖాలు కనిపించేలా వీడియో తీసిన బాధితుడిని ఎస్పీ అఖిల్  మహాజన్  అభినందించారు. అతడిని డీఎస్పీ జీవన్ రెడ్డి, మావల సీఐ స్వామి సన్మానించారు.