- లెక్కలు తీస్తున్న టీఆర్ఎస్
- గ్రామాలవారీగా లబ్ధిదారుల వివరాలు సేకరణ
- 30 స్కీముల కింద లక్షా 50 వేల మంది ఉంటారని అంచనా
- లెటర్లు, మెసేజ్ల ద్వారా ఇంటింటికీ కేసీఆర్ సందేశం పంపించాలనే ఆలోచన
నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు రూలింగ్ పార్టీ మరోసారి సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకుంటోంది. నియోజకవర్గంలోని సగం మంది ఓటర్లు.. పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి..ఇలా ఏదో రూపంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవారేనని, వాళ్లంతా తమవైపే మొగ్గుచూపుతారని భావిస్తోంది. కానీ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల టైంలోనూ టీఆర్ఎస్ హైకమాండ్ ఇలాంటి అంచనాలే వేసినప్పటికీ బెడిసికొట్టాయి. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇంటింటికీ దళితబంధు ప్రకటించి, అమలుచేసినా అనుకున్న ఫలితం రాలేదు. దీంతో ఈసారి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ల వారీగా ఊరూరా లబ్ధిదారుల లెక్కలు తీయిస్తున్నారు. అందరి అడ్రస్లూ తీసుకొని సీఎం కేసీఆర్ పేరుమీద ముద్రించిన లెటర్లను స్వయంగా పోస్ట్చేసేలా, ఫోన్లకు, వాట్సప్లకు మెసేజ్లు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫైళ్ల దుమ్ము దులుపుతున్నరు..
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సగానికి పైగా అంటే సుమారు లక్షన్నర మంది ఓటర్లు ఏదో ఒక ప్రభుత్వ స్కీం కింద లబ్ధి పొందుతున్నారని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది. ఆయా లబ్ధిదారులను తమ ఓట్లుగా మలుచుకోవడంలో దుబ్బాక, హుజూరాబాద్లో విఫలమయ్యామని, ఈసారి అలా జరగకూడదని ముందే అలర్ట్అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పై ఆఫీసర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెండు, మూడు రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల పూర్తి వివరాలు బయటికి తీయిస్తోంది. మొత్తంగా ఆరు మండలాల పరిధిలోని 157 గ్రామాల్లోని లబ్ధిదారుల వివరాలను డిపార్ట్మెంట్ల వారీగా సేకరిస్తున్నారు. సెలవు దినాలైనప్పటికీ శని, ఆదివారాల్లోనూ అక్కడి ఆఫీసర్లు, సిబ్బందికి సెలవులు క్యాన్సిల్ చేశారు.
రైతుబంధు మొదలు బతుకమ్మ చీరల దాకా..
రైతుబంధు మొదలుకొని బతుకమ్మ చీరల వరకు సుమారు 30 రకాల స్కీంల కింద లబ్ధిపొందిన వాళ్ల వివరాలు వేర్వేరుగా కావాలని తమ పై ఆఫీసర్లు అడిగినట్లు మునుగోడు మండలంలోని ఓ విలేజ్ సెక్రెటరీ చెప్పారు. ఇందులో రైతుబంధు, రైతుబీమా మొదలుకొని కేసీఆర్ కిట్లు, కంటి వెలుగు, గొర్రెల పంపిణీ, అన్ని రకాల పింఛన్లు, కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాల దాకా అన్నీ ఉన్నట్లు ఆయన వివరించారు. గ్రామాలవారీగా వచ్చిన ఈ సమాచారాన్ని ముందుగా ఆయా డిపార్ట్మెంట్లు, అక్కడి నుంచి క్రోడీకరించే బాధ్యతను జిల్లా ప్లానింగ్ విభాగానికి అప్పగించారు. ఈ నెల 20 తేదీన మునుగోడులో జరిగే సీఎం బహిరంగ సభకు ముందే లబ్ధిదారుల వివరాలు సీఎంవోకు అందించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
లెటర్లు రాస్తరట.. మెసేజ్లు చేస్తరట..
జిల్లా ప్లానింగ్ విభాగం ద్వారా గ్రామాల వారీగా సేకరిస్తున్న సమాచారంలో లబ్ధిదారుల సమగ్ర వివరాలు ఉండేలా చూస్తున్నారు. పేరు, ఊరు, కుటుంబం, ఫోన్ నంబర్ లాంటి వివరాలతో పాటు ఓటర్లకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఇప్పటివరకు ఏమేరకు లబ్ధి చేకూరింది? అనే డిటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఆ వివరాల ఆధారంగా స్వయంగా కేసీఆర్ పేరుతో ముద్రించిన లెటర్లను లబ్ధిదారుల ఇండ్లకు పంపించనున్నట్టు టీఆర్ఎస్లీడర్లు చెప్తున్నారు. ఫోన్లకు మెసేజ్లు, వాట్సాప్ ఉన్నవాళ్లకు రికార్డింగ్ వాయిస్మెసేజ్లు కూడా పంపే అవకాశముందని అంటున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని, ఇకముందు ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్కీములన్నీ కొనసాగిస్తామన్నట్లుగా సీఎం సందేశం ఉంటుందని భావిస్తున్నారు.