- వక్ఫ్బోర్డును ప్రశ్నించింది హైకోర్టు
హైదరాబాద్: ముస్లిం శ్మశానవాటికల కబ్జాలపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. శ్మశాన వాటికల ఆక్రమణలపై వక్ఫ్బోర్డు నివేదిక సమర్పించింది. విచారణలో భాగంగా శ్మశానాల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని వక్ఫ్బోర్డును ప్రశ్నించింది హైకోర్టు. కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్టు చూస్తోందని, ఆస్తుల పరిరక్షణపై వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మైనార్టీల కోసం పని చేస్తున్నారా?అని ప్రశ్నించింది. దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణలో బాధ్యతగా ఉండాలని చెప్పింది. సిబ్బంది కొరత వల్ల కొవిడ్ వేళ మరింత ఇబ్బందిగా ఉందని వక్ఫ్బోర్డు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించగా… సంబంధిత మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారు కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సర్వే నంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.