- ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పర్సేగఢ్ పీఎస్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోబ్రా బలగాలు ఆదివారం సాయంత్రం పర్సేగఢ్ అడవుల్లోని పిల్లూరు కాండ్లపర్తి గ్రామాల మధ్య కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర ఒక్కసారిగా పేలింది.
దీంతో ఏఎస్సై అమిత్కుమార్ యాదవ్, కానిస్టేబుల్ కమలేశ్ పైగామ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు. పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు.
