లండన్: ‘లండన్లో మండుతున్న ఎండలకు కారణం గ్లోబల్ వార్మింగ్.. ఇప్పటికైనా పర్యావరణానికి నష్టం కలిగించడం మానుకోండి’ అంటూ భారీ సంఖ్యలో ఆందోళనకారులు లండన్ వీధుల్లో శనివారం ర్యాలీలు తీశారు. పెద్ద ఎత్తున పొల్యూషన్కు కారణమవుతున్న చమురు, గ్యాస్ ఉత్పత్తిని కంట్రోలో చేయాలని నినాదాలు చేశారు. కొత్త లైసెన్సులు ఇవ్వడం ఆపేయాలని డిమాండ్ చేశారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలను వేగవంతం చేయకుంటే పార్లమెంట్ ముందు ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కిందటి మంగళవారం దేశంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానికి ఇది ఉదాహరణ అని ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ సంస్థకు చెందిన ఇండిగో రంబెలో చెప్పారు. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు దేశం ఇంకా సిద్ధంకాలేదని వివరించారు. వారంపాటు కొనసాగిన హీట్వేవ్కారణంగా వేలాదిమంది చనిపోయారని, కార్చిచ్చులు చెలరేగి ఇండ్లు తగలబడిపోయాయని వివరించారు. ఒక దశలో ఎమర్జెన్సీ సిబ్బంది కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొందని రంబెలో తెలిపారు. గ్లోబల్ క్లైమేట్ ఎమర్జెన్సీపై కొన్నిసంవత్సరాలుగా తాము ఆందోళన వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంమన కాళ్ల కిందికి చేరిందని, ఇప్పుడైనా ప్రభుత్వాలు మేలుకోవాలని కోరారు.
ఆగస్టులో ఇంకో హీట్వేవ్..
కిందటి వారంలో యూకేలో రికార్డు స్థాయిలో నమోదైన టెంపరేచర్లు ఇప్పుడు కాస్త తగ్గాయి. అయితే, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో టెంపరేచర్ మళ్లీ 40 డిగ్రీలు దాటుతుందని హెచ్చరించారు. వచ్చే వారంలో బ్రిటన్లో టెంపరేచర్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, సాధారణ సగటు ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగానే నమోదవుతుందని మెటరాలజిస్ట్ అలెక్స్ డీకెన్ చెప్పారు.