న్యూఢిల్లీ: ఇండియా విశ్వగురు అని, ఆ దేశంతో మెరుగైన సంబంధాలను తాము కోరుకుంటున్నామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా అన్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషించాలని ఆమె కోరారు. మంగళవారం ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్(ఐసీడబ్ల్యూఏ)లో జపరోవా మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి ఓ సందేశంతో ఇండియాకు వచ్చానని తెలిపారు. ఉక్రెయిన్, ఇండియా మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. హింసను రెచ్చగొట్టే వారిని ఆపకుంటే తలెత్తే ప్రమాదాలను గుర్తించాలని భారత్కు ఆమె సూచించారు.
యుద్ధకాంక్షతో ఉన్న పొరుగు దేశాలతో వ్యవహరించడం ఎలా అనే దానికి రష్యా దురాక్రమణే ఉదాహరణ అన్నారు. ‘‘చైనా, పాకిస్తాన్తో ఇండియాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యుద్ధకాంక్ష ఉన్న, హింసను రెచ్చగొట్టే పొరుగు దేశాలను ఆపకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి” అని జపరోవా వ్యాఖ్యానించారు.