
వరంగల్: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కళ అని, ప్రధాని మోడీ ఆ కలను సాకారం చేశారని అన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. శనివారం (జూలై 19) ఆయన వరంగల్లో పర్యటించారు. ప్రత్యేక రైలులో కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకున్న అశ్విని వైష్ణవ్.. అక్కడి నుంచి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దగ్గరకి వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2025 డిసెంబర్ వరకు రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవుతుందని, 2026లో మాన్యుఫాక్చరింగ్ మొదలవుతుందని తెలిపారు. ఇక్కడ ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారు అవుతాయన్నారు. దేశంలో అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుందన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైందని అన్నారు. కాజీపేటకు వ్యాగన్ తయారీ, కోచ్ల తయారీ, ఓవర్ హాలింగ్ మూడు యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. దీని ద్వారా మూడువేల మందికి నేరుగా ఉపాది లభిస్తుందని అన్నారు.
ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చిందని.. మోడీ గ్యారంటీ అంటే అది తప్పకుండా నెరవేరుతుందన్నారు. త్వరలో వరంగల్కు ఎయిర్ పోర్టు వస్తుందన్నారు. మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారో వరంగల్కు వచ్చి చూసి మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ కమిట్మెంట్తో ఉందని స్పష్టం చేశారు.