
- పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు మొదలు రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపును ఇజ్జత్ కా సవాల్గా తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వాళ్లను గెలిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వమే అభ్యర్థులను ప్రకటిస్తుందని, ఈ విషయంలో తన అభిప్రాయం ఫైనల్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘నాకు గ్రూపుల్లేవు.. నాది బీజేపీ గ్రూపు.. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీ క్యాండిడేట్ కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే, అంతకంటే వంచన మరొకటి ఉండదు’ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు నయా పైసా ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ పల్లెలకు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ గ్రామాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు విరక్తితో ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోందని, వాస్తవాలను ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ఇన్చార్జులు గంగిడి మనోహర్రెడ్డి, శాంతికుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.