కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలె

కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలె

హైదరాబాద్: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ కోడ్ చట్టం తీసుకొచ్చిందని కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ కార్మికోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయన్నారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నారని, ఇది శుభ పరిణామం అని అన్నారు. ఇక కరోనా వల్ల సినీ కార్మికులు ఉపాధిలేక చాలా అవస్థలు పడ్డారని, కానీ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం సినీ రంగానికి పూర్వపు రోజులొచ్చాయని తెలిపారు. 

దేశంలో 45 కోట్ల అసంఘటిత కార్మికులున్నారన్న ఆయన... ఈఎస్ఐ, పీఎఫ్ రాక వారంతా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలోనే నేషనల్ సోషల్ సెక్యూరిటీ చట్టాన్ని రూపొందించామని అన్నారు. ఈ చట్టం ద్వారా సినీ కార్మికులకు చాలా మేలు జరగనుందని తెలిపారు. ఈ చట్టంలోని ప్రయోజనాలు పొందాలంటే కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలని కోరారు. కేవలం 6 కోట్ల మంది పీఎఫ్, మూడున్నర కోట్ల మంది ఈఎస్ఐ సదుపాయం పొందుతున్నారని, మిగతా వారందరికి ఈ అవకాశం కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మెగాస్టార్ చిరంజీవి, ఆర్. నారాయణ మూర్తి, దిల్ రాజు, అలీ, ఎన్.శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే

రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్కు భయమెందుకు..?