న్యూఢిల్లీ: ఇండియా షట్లర్ ఉన్నతి హుడా.. హైలో ఓపెన్ సూపర్–500లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి 22–20, 21–13తో నాలుగోసీడ్ లిన్ సియాంగ్ టి (చైనీస్తైపీ)పై సంచలన విజయం సాధించింది. 47 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్కు ఆరంభంలో గట్టి పోటీ ఎదురైంది.
8–10తో వెనుకబడినా వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 14–10 లీడ్లో నిలిచింది. ఇక్కడి నుంచి ఇద్దరు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా స్కోరు 20–20 వద్ద సమమైంది. ఈ దశలో ఉన్నతి రెండు స్మాష్లతో గేమ్ గెలిచింది. ఇక రెండో గేమ్లో ఉన్నతి పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. 9–11తో వెనుకబడినా క్రాస్ కోర్టు ర్యాలీలతో వరుసగా పాయింట్లు గెలిచింది.
ఫలితంగా స్పష్టమైన ఆధిక్యంతో గేమ్, మ్యాచ్ను సొంతం చేసుకుంది. మెన్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 17–21, 21–14, 15–21తో నాలుగోసీడ్ అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్లో ఆయుష్ షెట్టి 21–19, 12–21, 20–22తో కల్లె కొలిజెనెన్ (ఫిన్లాండ్) చేతిలో కంగుతిన్నాడు.
