- కమ్యూనికేషన్ లోపం వల్లే ఈ వార్తలన్నీ
- మన దగ్గర కావాల్సినంత పవర్ ఉంది
- ఎవరికి కావాల్నో చెప్పండి.. సప్లై చేస్తం
- ఢిల్లీ సీఎం నాతో మాట్లాడి ఉండాల్సింది
- కాంగ్రెస్సోళ్లు వాళ్ల టైమ్లో నిల్వలు పెంచలేదేమని ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు షార్జేజ్ లేదని, అనవసర భయాన్ని సృష్టించారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. గెయిల్, టాటా సంస్థల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్లే ఈ ప్రచారం జరిగిందన్నారు. దేశంలో 6 కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కోల్ షార్టేజీ ఉందని వార్తలు రావడంతో మంత్రి ఆర్కే సింగ్ ఆదివారం స్పందించారు. ‘మన దగ్గర కరెంటు కావాల్సినంత ఉంది. దేశమంతా సప్లై చేస్తున్నం. పవర్ ఎవరికి కావాల్నో నాకు చెప్పండి. నేను సప్లై చేస్తా’ అన్నారు. ‘ఢిల్లీకి నిరంతరాయంగా పవర్ సప్లై అవుతూనే ఉంటుంది. లోడ్కు సంబంధించి భయం ఏం అవసరం లేదు. చార్జీలతో సంబంధం లేకుండా దేశీయ, విదేశీ బొగ్గు సప్లై జరుగుతూనే ఉంటుంది. గ్యాస్ సప్లై ఎట్టిపరిస్థితుల్లో తగ్గదు’ అని చెప్పారు. సప్లైపై ప్రభావం పడుతోందని డిస్ట్రిబ్యూటర్లకు గెయిల్అధికారులు తప్పుడు మెసేజ్ పంపండంతో ఇలాంటి వార్తలు వచ్చాయని, ఇలాంటివి మళ్లీ జరగకుండా వాళ్లను హెచ్చరించామని అన్నారు.
ప్రస్తుతం దేశంలో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని మంత్రి తెలిపారు. అంతమాత్రాన బొగ్గు అయిపోయినట్టు కాదన్నారు. ‘అవి కేవలం రిజర్వ్స్. బ్యాకప్. సప్లై వస్తూనే ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా వర్షా కాలంలో సప్లై తగ్గుతుంటుందని, కానీ పెరుగుతున్న ఎకానమీలో డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని వివరించారు. అక్టోబర్లో డిమాండ్ తగ్గుతుందని, బ్యాకప్ పెరుగుతుందని చెప్పారు. గత నవంబర్ నుంచి ఈ జూన్ వరకు 17 రోజులకు సరిపడా రిజర్వ్స్ ఎప్పుడూ ఉండేవన్నారు. బొగ్గు షార్టేజ్పై ప్రధానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెటర్ రాయడంపైనా మంత్రి స్పందించారు. ‘సీఎం నాతో మాట్లాడి ఉండాల్సింది. ఢిల్లీ పోయి శనివారం నాకు ఫోన్ చేశారు. ఢిల్లీకి షార్టేజ్ ఉండదని హామీ ఇచ్చాను’ అన్నారు. ‘కాంగ్రెస్ హయాంలో లోడ్ బ్యాలెన్స్ తప్పించకుండా రిజర్వ్స్ పెంచుకొని ఉండాల్సింది’ అని విమర్శించారు.
నిల్వలు తగ్గిపోయాయంటూ..
ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా చాలా రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయని.. దేశంలోని 135 థర్మల్ పవర్ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల్లో నిల్వలు తక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. ఢిల్లీలో బొగ్గు నిల్వలపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో విద్యుత్ సంక్షోభం రాకుండా బొగ్గు, గ్యాస్ సరఫరా చేయాలని ప్రధానికి లెటర్ రాశారు. రెండుమూడు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
కేంద్రం చూసీ చూడనట్లు నటిస్తోంది: మనీశ్
దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడిందన్న విషయాన్ని కేంద్రం ఒప్పుకోవట్లేదని, ప్రతి సమస్యనూ చూసీ చూడనట్లుగా నటిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. దేశంలో బొగ్గు కొరత లేదని, కావాలనే భయాందోళనలు సృష్టిస్తున్నారని.. ఈ అంశంపై మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాయడం బాధ్యతారాహిత్యం అంటూ ఆదివారం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన కామెంట్స్పై స్పందించారు. కరోనా టైంలో ఆక్సిజన్ కొరతను సమస్యను గుర్తించేందుకు కేంద్రం అంగీకరించలేదని, అసలు ఆక్సిజన్ కొరతే లేదని బుకాయించిందన్నారు. ఇలా సంక్షోభం వచ్చిన ప్రతిసారీ కేంద్రం చూసీ చూడనట్లు నటించడం దేశానికి మంచిది కాదన్నారు. బొగ్గు సంక్షోభంతో పవర్ క్రైసిస్ ఏర్పడి, దేశమంతా చీకట్లు అలుముకుంటాయన్నారు. కోల్ క్రైసిస్ను కేంద్రం ఒప్పుకోవాలని చేతులు జోడించి కోరుతున్నానని అన్నారు.