
- పేరుకు పెద్ద హాస్పిటల్స్..
- ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు
- జిల్లాలో కొనసాగుతున్న హెల్త్ టీమ్స్ తనిఖీలు
- చాలా హాస్పిటల్స్లోరిజిస్టర్డ్ డాక్టర్లే లేరు
- జిల్లాలో 288 హాస్పిటల్స్, 57 డయాగ్నిస్టిక్ సెంటర్లు
యాదాద్రి, వెలుగు : పేరుకు పెద్ద హాస్పిటల్స్.. రిజిస్టర్డ్ ఎంబీబీఎస్డాక్టర్లు మాత్రం లేరు. అక్కడ ట్రీట్మెంట్ చేసేదీ ఆర్ఎంపీలే. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్పించడం లేదు. అసలు డాక్టర్లు లేకున్నా హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్సే ఎక్కువగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో ఇటీవల అబార్షన్లు, బాలింత, శిశువుల మృతి కేసులు వెలుగు చూశాయి. ఎంబీబీఎస్ పాస్ కాని వాళ్లు అబార్షన్లు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ను తనిఖీ చేయడానికి ఆరు టీమ్స్ను కలెక్టర్ హనుమంతరావు ఏర్పాటు చేశారు.
ప్రోగ్రామ్ఆఫీసర్ల నేతృత్వంలోని ఈ ఆరు టీమ్స్ జిల్లాలోని 288 రిజిస్ట్రర్డ్హాస్పిటల్స్, 57 డయాగ్నిస్టిక్ సెంటర్లను తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటివరకు సగానికి పైగా హాస్పిటల్స్ను ఈ టీమ్స్తనిఖీ చేశాయి. హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రర్డ్డాక్టర్లు ఉన్నారా..? బయో మెడికల్వేస్ట్మేనేజ్మెంట్నిర్వహిస్తున్నాయా..? హాస్పిటల్స్పేషెంట్లకు కనీస వసతులు కల్పిస్తున్నారా..? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
పాత రిజిస్ట్రేషన్లే.. రికార్ట్ మెయింటనేన్స్లేదు..
ఇప్పటివరకు తనిఖీ చేసిన హాస్పిటల్స్కు గతంలో చేసిన రిజిస్ట్రేషన్లే ఉన్నాయి. అయితే హాస్పిటల్స్ను నియంత్రించడానికి 2010లో యూపీఏ సర్కారు 'క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్యాక్ట్-2010' తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్హాస్పిటల్స్లో పని చేసేవారు కచ్చితంగా మెడికల్కౌన్సిల్, పారా మెడికల్బోర్డు, నర్సింగ్కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2022 జూన్ 14న జీవో నంబర్64కు అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే హెల్త్టీమ్స్చేస్తున్న ఈ తనిఖీల్లో చాలా హాస్పిటల్స్ ఇంకా పాత రిజిస్ట్రేషన్లతోనే కొనసాగుతున్నాయని తేలింది. పైగా రికార్డుల మెయింటెనెన్స్ లేకపోవడంతో వచ్చిన పేషెంట్లు, ట్రీట్మెంట్ చేసిన వివరాలు ఏవీ లేవు. బయో మెడికల్ వేస్ట్మేనేజ్మెంట్అమలు చేయడం లేదు.
ఎంబీబీఎస్లు లేరు.. ఆర్ఎంపీలే.
హెల్త్ టీమ్స్తనిఖీలు నిర్వహించిన కొన్ని హాస్పిటల్స్లో గత రిజిస్ట్రేషన్ ప్రకారం నమోదైన ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. ఆ కుర్చీల్లో ఆర్ఎంపీలు కూర్చొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ హాస్పిటల్లో రిజిస్టర్ అయిన డాక్టర్లకు హెల్త్టీమ్స్ ఫోన్ చేస్తే కొందరి నుంచి రిప్లయ్ లేదు. మరికొందరు తాము ఆ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. కొందరైతే ఫంక్షన్లకు వెళ్లామంటూ సాకులు చెబుతున్నారు. భూదాన్ పోచంపల్లిలోని ఓ హాస్పిటల్కు రిజిస్ట్రేషన్ ఉంది.. హాస్పిటల్ తెరిచే ఉన్నా డాక్టర్లు మాత్రం లేరు. దీంతో హాస్పిటల్మూసి వేయాలని మేనేజ్మెంట్కు హెల్త్టీమ్ సూచించింది.
డయాగ్నిస్టిక్ సెంటర్లలోనూ ఎక్కడా రికార్డ్మెయింటేన్స్ చేయడం లేదని గుర్తించారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి స్కానింగ్ తీశారో తెలియకుండా ఉంది. దీంతో రికార్డులు కచ్చితంగా మెయింటేన్స్చేయాలని టీమ్స్ హెచ్చరించాయి. తాము తనిఖీలు నిర్వహించిన హాస్పిటల్స్లోని లోపాలు, ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ చేయడం వంటి అంశాలతో హాస్పిటల్ వారీగా రిపోర్ట్ రూపొందించి డీఎంహెచ్వోకు అందిస్తున్నారు. ఆ రిపోర్టులను కలెక్టర్ పరిశీలించిన అనంతరం.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్స్, డయాగ్నిస్టిక్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. వివరణ తర్వాతే హాస్పిటల్స్, డయాగ్నిస్టిక్స్సెంటర్ కొనసాగింపుపై స్పష్టత వస్తుంది.
ఒక్క నెలలోనే ఐదు సంఘటనలు..
జిల్లాలో ఒక్క జూలై లోనే ఐదు సంఘటనలు వెలుగు చూశాయి. జిల్లా కేంద్రమైన భువనగిరిలో లింగనిర్ధారణ అనంతరం రెండు అబార్షన్లు ఒకే హాస్పిటల్లో చేయడంతో పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. మరో హాస్పిటల్లో అబార్షన్ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో హెల్త్ డిపార్ట్మెంట్విచారణ జరిపింది. అయితే 'బాత్రూమ్ వెళ్లినప్పుడు గర్భం నుంచి శిశువు జారిపోయినందున హాస్పిటల్లో తాము ట్రీట్మెంట్జరిపించుకున్నాం' అని విచారణలో యాదగిరిగుట్ట మండలానికి చెందిన దంపతులు తెలపడంతో డిపార్ట్మెంట్ బాధ్యులు మౌనం వహించారు. మరోవైపు చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో బాలింత మృతి చెందింది. భువనగిరిలోని మరో హాస్పిటల్లో గర్భిణికి ట్రీట్మెంట్ అనంతరం హైదరాబాద్కు సిఫారసు చేయడం, అక్కడికి వెళ్లే సరికే గర్భంలోనే శిశువు మృతి చెందిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.