
- అక్టోబర్ 1 నుంచి నిలిపివేయాలని బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు ఎన్పీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి యూపీఐలో పీర్ -టు -పీర్ (పర్సన్2పర్సన్) 'కలెక్ట్ రిక్వెస్ట్లను' నిలిపివేయాలని బ్యాంకులు, పేమెంట్ యాప్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆదేశించింది. సర్క్యులర్ ప్రకారం, పీ2పీ కలెక్ట్ లావాదేవీలను ప్రారంభించడం, రూట్ చేయడం లేదా ప్రాసెస్ చేయడం నిషేధం. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్లు ఈ నిబంధనను అనుసరించాలి.
ప్రస్తుతం ఇలాంటి మార్గంలో ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.2 వేలు మాత్రమే రిక్వెస్ట్ చేయడానికి వీలుంది. అది కూడా రోజుకు 50 విజయవంతమైన లావాదేవీలకే పరిమితం. "ఈ ఫీచర్ తొలగించడం వల్ల యూపీఐ వేగవంతమైన, సురక్షితమైన ప్లాట్ఫామ్గా బలపడుతుంది. మోసాలు గణనీయంగా తగ్గుతాయి. ఇకపై అన్ని పీ2పీ లావాదేవీలు చెల్లించే వాళ్లే ప్రారంభించాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి" అని ఎన్టీటీ డేటా పేమెంట్ సర్వీసెస్ ఇండియా సీఎఫ్ఓ రాహుల్ జైన్ అన్నారు.