ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల పనుల కారణంగా.. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బస్టాప్ను నల్లచెరువుకు మార్చడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరంగల్, జనగాం, యాదగిరిగుట్ట వెళ్లే బస్సులను ఇక్కడి నుంచే నడుపుతుండగా, కొత్త బస్టాప్ వద్ద కనీస వసతులు లేకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎండ నుంచి రక్షణకు కేవలం టెంట్ మాత్రమే వేసి వదిలేశారన్నారు. కూర్చోవడానికి కుర్చీలు, తాగడానికి నీరు లేక వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతం జనవాసాలకు దూరంగా ఉండటంతో తాగునీరు కొనుక్కుందామన్నా దుకాణాలు లేక అల్లాడిపోయారు.అధికారులు స్పందించి తక్షణమే అన్ని వసతులు కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

