మయామి: మనం తీసుకెళ్లే లగేజీ నుంచి వేసుకున్న చెప్పులదాకా.. అన్నింటినీ చెక్ చేస్తేగానీ అధికారులు ఎయిర్పోర్టులోకి అనుమతించరు. భద్రతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ప్యాసింజర్లకు చెందిన అన్నిరకాల వస్తువులను తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో తనిఖీ చేయాల్సిన ప్యాసింజర్ల బ్యాగుల్లోంచి చెక్ పాయింట్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఆఫీసర్లే డబ్బులు కొట్టేస్తున్నారు. హ్యాండ్ పర్స్లలో పెట్టుకున్న క్యాష్ను కాజేస్తున్నారు.
తమ డబ్బులు పోయాయని ఫిర్యాదులు అందడంతో ఎయిర్పోర్ట్ అధికారులు నిఘా పెట్టారు. చెక్పాయింట్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. అక్కడి సిబ్బందే ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. దీంతో వాళ్లిద్దరిని పోలీసులకు అప్పగించారు. అమెరికా ఫ్లోరిడా స్టేట్లోని మయామి ఎయిర్పోర్టులో జరిగిన ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు శనివారం బయటపడటంతో వైరల్ అయ్యాయి.
రోజుకు రూ.83 వేలు..
మయామి ఎయిర్పోర్టులోని చెక్ పాయింట్ వద్ద ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది జోసు గోంజాలెజ్, లాబరియస్ విలియమ్స్ పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న ప్రయాణికులు తమ లగేజీని చెకింగ్ కోసం సెక్యూరిటీ స్కాన్ మెషీన్పై పెట్టగా.. వాటిల్లోంచి వీళ్లిద్దరూ క్యాష్ కొట్టేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ‘‘వచ్చిన లగేజీని సర్దుతూ స్కానింగ్ మెషీన్లోకి పంపించడం వీళ్ల డ్యూటీ. అయితే, పనిలోపనిగా లగేజీల్లోంచి డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. ఓ ప్యాసింజర్ లగేజీలో ఉన్న పర్స్ నుంచి 600 డాలర్లను గోంజాలెజ్ తీసి జేబులో పెట్టుకున్నాడు. మరో ప్రయాణికుడి లగేజీలోని నగదును విలియమ్స్ కొట్టేశాడు” అని పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి యావరేజ్గా రోజుకు వెయ్యి డాలర్లు(రూ.83 వేలు) కొట్టేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వాళ్లిద్దరినీ ఉద్యోగాల నుంచి తీసేశామని,విచారణ కొనసాగుతోందని తెలిపారు.