- మతప్రాతిపదికపై పౌరసత్వమా?
- రాజ్యసభ కూడా ఓకే చేస్తే..అమిత్ షాపై ఆంక్షలు తప్పవ్
- సిటిజన్ షిప్ బిల్లుపై యూఎస్ కమిషన్
వాషింగ్టన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సిటిజన్షిప్’ బిల్లుపై యూఎస్కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తంచేసింది. సెక్యులర్ దేశంలో మతప్రాతిపదికగా తీసుకొచ్చిన ఈ బిల్లు ‘తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపు’ అని కామెంట్ చేసింది. లోక్సభ దీనికి ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టింది. ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే అమిత్ షా తో పాటు ఇతర ప్రధాన నేతలపైనా ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు యూఎస్ సీఐఆర్ఎఫ్ తన అధికారిక ట్విట్టర్లో తెలిపింది. దీంతోపాటు కమిషన్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. సిటిజన్షిప్ ఎమెండ్మెంట్ బిల్లు(సీఏబీ) మతప్రాతిపదికన రూపొందించిందని ఇందులో ఆరోపించింది. దేశ లౌకిక చరిత్రకు ఇది వ్యతిరేకమని, రాజ్యాంగ విలువలను, సమానత్వపు హక్కును కాలరాస్తుందని విమర్శించింది. అమెరికన్ కాంగ్రెస్ కమిటీ కూడా ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేసింది.
1998లో ఏర్పాటు..
యునైటెడ్ స్టేట్స్ కమిషన్ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు జరిపే స్వతంత్ర సంస్థ. 1998లో ఈ కమిషన్ ఏర్పాటయింది. అంతర్జాతీయంగా మత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది. అమెరికా బయట మతస్వేచ్ఛకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ప్రెసిడెంట్కు పాలసీ నిర్మాణంలో సలహాలు, సూచనలు అందజేస్తుంది.
మోడీ వీసా కోసం రికమెండేషన్
2002లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా అప్పటి సీఎం నరేంద్ర మోడీకి వీసా ఇవ్వకుండా అమెరికా ఆంక్షలు పెట్టింది. తర్వాత మూడేళ్లకు మోడీ వీసాపై ఆంక్షలను ఎత్తేయాలని యూఎస్సీఐఆర్ఎఫ్ అమెరికా సర్కారుకు సిఫార్సు చేసింది. దీంతో అమెరికా మోడీకి వీసా జారీ చేసింది.
పక్షపాత ధోరణితోనే ప్రకటన
సిటిజన్షిప్ బిల్లుపై యూఎస్సీఐఆర్ఎఫ్ విడుదల చేసిన ప్రకటన పక్షపాతపూరితంగా ఉందని, దాని ప్రకటనను పట్టించుకోబోమని మన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ స్పష్టం చేశారు. కమిషన్ ప్రకటనవార్నింగ్ కాదు.. సూచనాకూడా కాదన్నారు. గత పాలకుల హయాంలోనూ ఆ కమిషన్ ప్రకటనల ను పక్కకు పెట్టిన చరిత్ర ఉందన్నారు. మతపరమైన ఆంక్షల వల్ల ఇండియాకు వలస వస్తున్న నాన్ముస్లింల ఇబ్బందులను, వారి హక్కులను పరిగణలోకి తీసుకునే ఈ బిల్లును తెచ్చామన్నారు. నిజంగా మత స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న వ్యక్తులు, సంస్థలు దీని వెనకున్న ఉద్దేశాన్ని గుర్తించి బిల్లును స్వాగతించాలని రావీష్ కుమార్
అన్నారు.
హిందూ రాజ్యం విస్తరణ కోసమే: పాక్
ఇస్లామాబాద్: మతం ఆధారంగా పొరుగు దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలను సిటిజన్షిప్ బిల్లు బయటపెట్టిందని పాకిస్తాన్ఆరోపించింది. ఈ బిల్లు వివక్షాపూరితంగా ఉందని, సంబంధిత దేశాల్లో మైనార్టీల భద్రత, హక్కుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సోమవారం లోక్సభ ఆమోదించిన సిటిజన్షిప్ ప్రకారం.. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31 లోపు ఇండియా వచ్చిన హిందూ, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారిని అక్రమ వలసదారులుగా చూడకుండా ఇండియన్ సిటిజన్షిప్ కల్పిస్తారు. ఈ బిల్లుపై ఇమ్రాన్ఖాన్ ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చట్టాల్లోని అన్ని నియమాలను, పాక్తో ఒప్పందాలను ఈ బిల్లు ఉల్లంఘించిందన్నారు. హిందూ రాజ్యాన్ని విస్తరించాలన్న ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలకు అనుగుణంగానే ఈ డిజైన్ ఉందని విమర్శించారు.