అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమిగ్రేషన్ విధానాల్లో తీసుకొచ్చిన మార్పులతో భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. ఇప్పటికే H-1B వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా.. దరఖాస్తు రుసుమును కూడా పెంచింది. దీంతో అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై ఇక నుండి మరింత ఆర్థిక భారం పడనుంది. కాగా అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చే అప్రెంటిస్ ప్రొగ్రామ్కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు.
2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు చేశారు. అయితే దరఖాస్తు రుసుమును ఎంత పెంచాలనుకుంటున్నారు.. ఏయే కేటగిరిలోని దరఖాస్తుదారులకు ఈ పెంపు వర్తిస్తుంది లాంటి పూర్తి వివరాలను అకోస్టా చెప్పలేదు. H-1B దరఖాస్తు రుసుమును పెంచినట్లయితే ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. H-1B వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే.. ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది.