- కంపెనీ షేర్లు 12 శాతం పతనం
న్యూఢిల్లీ: టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టర్లు కేవలం ఒక్క రోజులోనే 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయారు. ఏఐ, క్లౌడ్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నా పెద్దగా ఫలితం లేకపోవడంతో కంపెనీ షేర్లు గురువారం ఇంట్రాడేలో 12 శాతం వరకు పతనమయ్యాయి. 2020 మార్చి తర్వాత కంపెనీకి ఇదే అత్యధిక సింగిల్ డే నష్టం. ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 424 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.39 లక్షల కోట్లు) తగ్గింది. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంతలా పడడం చరిత్రలో ఇది రెండోసారి. చైనా డీప్సీక్ దెబ్బకు కిందటేడాది జనవరి 27 న ఏఐ కంపెనీ ఎన్విడియా మార్కెట్ క్యాప్ ఒక్కరోజే 593 బిలియన్ డాలర్లు తగ్గింది.
1987 బ్లాక్ మండే, డాట్కామ్ బబుల్, 2020 కొవిడ్ సమయంలో కూడా మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ ఇదే స్థాయిలో పడింది. కంపెనీ భారీగా ఏఐ, క్లౌడ్లో పెట్టుబడులు పెడుతున్నా, రాబడి స్పష్టంగా కనిపించడం లేదని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజా డిసెంబర్ క్వార్టర్లో మైక్రోసాఫ్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 66శాతం పెరిగి 37.5 బిలియన్ డాలర్లకి చేరింది. అజ్యూర్ క్లౌడ్ వృద్ధి తగ్గడం, జీపీయూ చిప్ల సరఫరా సమస్యలు, ఓపెన్ ఏఐతో 250 బిలియన్ డాలర్ల ఒప్పందం ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. కంపెనీ షేర్లు శుక్రవారం 0.51 శాతం తగ్గి 431.29 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయి.
