న్యూయార్క్: అమెరికాలోని మేరీల్యాండ్లో విషాదం జరిగింది. మన దేశానికి చెందిన భార్యభర్తలు, వారి ఆరేండ్ల కొడుకు తుపాకీ గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మేరీల్యాండ్ స్టేట్లోని బాల్టిమోర్ కౌంటీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన భార్యభర్తలు యోగేష్ హెచ్ నాగరాజప్ప (37), ప్రతిభా వై. అమర్నాథ్ (37) బాల్టిమోర్ కౌంటీలో నివసిస్తున్నారు. వారికి ఆరేండ్ల కుమారుడు యష్ హొన్నాల్ (6) ఉన్నాడు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్టు తెలిసింది.
కాగా, శుక్రవారం మధ్యాహ్నం వారి ఇంట్లో నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో వారి ఇంటిపక్కవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్కు చేరుకొని పరిశీలించి.. వారు ముగ్గురూ తుపాకీ గాయాలతో చనిపోయినట్టు నిర్ధారించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, నాగరాజప్ప తన భార్య, కొడుకును చంపి ఆ తర్వాత తానూ సూసైడ్ చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు.