తెలంగాణ వర్సిటీలో నువ్వా? నేనా?

తెలంగాణ వర్సిటీలో నువ్వా? నేనా?

తెలంగాణ యూనివర్సిటీలో వీసీ, ఈసీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. వీసీ, ఈసీ పోటాపోటీగా రిజిస్ట్రార్లను నియమించడంతో వర్సిటీ పరువు బజారున పడింది. 
నిజామాబాద్,  వెలుగు : 
నిజామాబాద్​లోని తెలంగాణ వర్సిటీలో ఇటీవలి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీసీ రవీందర్​గుప్తాకు, ఈసీ(పాలక మండలి)కి మధ్య వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. వీసీ రవీందర్​గుప్తాకు వ్యతిరేకంగా మెజారిటీ ఈసీ సభ్యులు ఏకం కావడం, వారికి ఉన్నత విద్యా శాఖ కమిషనర్​ నవీన్​మిట్టల్​, కార్యదర్శి వాకాటి కరుణ అండగా నిలవడం, ఇరువర్గాలు పోటాపోటీగా రిజిస్ట్రార్లను నియమించడంతో యూనివర్సిటీ పరువు బజారున పడింది.  వీసీ అపాయింట్​ చేసిన విద్యావర్ధినికి రిజిస్ట్రార్​గా కొనసాగే అర్హత లేదంటూ పాలకమండలి యాదగిరిని నియమించగా, వీసీ రవీందర్​ గుప్తా హైకోర్టు నుంచి స్టే పొందారు.  కోర్టు ఆర్డర్​ వచ్చేదాకా ఈసీ నిర్ణయం ప్రకారం యాదగిరి రిజిస్ట్రార్​​గా వారం పాటు పని చేశారు. ఇంతలో వీసీ రవీందర్​గుప్తా  ఓయూ ప్రొఫెసర్​ నిర్మలాదేవిని ఆ పోస్టులో నియమించారు. ఓ వైపు ఆమె ఆ పదవిలో ఉండగానే, సోమవారం ఉదయం అకస్మాత్తుగా యాదగిరి వచ్చి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోవడం కలకలం రేపింది. ఐదుగురు ఈసీ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన సీటులో కూర్చొని రిజిస్ట్రార్​ హోదాలో ఫైళ్లు చూశారు.  మరోవైపు తానే రిజిస్ట్రార్​నంటూ నాలుగు రోజుల కింద చార్జి తీసుకున్న నిర్మలాదేవి చివరకు హైదరాబాద్​ స్థాయిలో జరిగిన హైడ్రామా తర్వాత ఓయూలోని ఇంజినీరింగ్​ కాలేజీ ప్రొఫెసర్​గా (పూర్వస్థానంలో) జాయినింగ్​ రిపోర్టు ఇచ్చారు. 

జరిగింది ఇదే.. 

వీసీ రవీందర్​ గుప్తా ఈసీ మీటింగ్​ పెట్టకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, అడ్డదారుల్లో ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపిస్తూ మెజారిటీ ఈసీ మెంబర్లు ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ​నవీన్ ​మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ యూనివర్సిటీలో వివాదం మొదలైంది. దీంతో నవీన్​మిట్టల్  ఆధ్వర్యంలో ఏప్రిల్​19న హైదరాబాద్​లో ఈసీ మీటింగ్​ నిర్వహించగా, వీసీ రవీందర్​ గుప్తా, ఆయన నియమించిన రిజిస్ట్రార్​ విద్యావర్ధిని, ఈసీ మెంబర్లు వచ్చారు. విద్యావర్ధినిని రిజిస్ట్రార్​గా  వీసీ పరిచయం చేయగా, వెంటనే మీటింగ్​ నుంచి వెళ్లిపోవాలంటూ నవీన్ ​మిట్టల్ ​ఆదేశించారు. 

విద్యావర్ధిని వెళ్లిపోగా,  వీసీ సైతం మీటింగ్​ను బాయ్​కాట్ ​చేశారు. దీంతో వాకాటి కరుణ అధ్యక్షతన ఈసీ మీటింగ్​ జరిపి, తెలంగాణ వర్సిటీ ప్రొఫెసర్ ​యాదగిరిని రిజిస్ట్రార్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియామకంపై వీసీ రవీందర్​ గుప్తా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. ఈలోగా 26న హైదరాబాద్​లో మరోసారి సమావేశమైన ఈసీ.. వర్సిటీలో ఈసీ ఆమోదం లేకుండా చేసిన  ఖర్చులు, ఇచ్చిన ప్రమోషన్లు, ఔట్​ సోర్సింగ్​ అపాయింట్​మెంట్లు 2022–-23, 2023-–24 బడ్జెట్​ రూపకల్పన తదితర విషయాలపై విచారణ కోరుతూ  విజిలెన్సు అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్, ఏసీబీ డీజీలకు లెటర్​ రాశారు. ఈలోగా వర్సిటీ రిజిస్ట్రార్​గా వీసీ రవీందర్​గుప్తా ఉస్మానియా ప్రొఫెసర్​ నిర్మలాదేవిని అపాయింట్​ చేశారు.  మే 3న నిర్మలాదేవిని చార్జి తీసుకున్నారు. మే 5న హైదరాబాద్​లో మరోసారి సమావేశమైన ఈసీ.. యాదగిరిని కంటిన్యూ చేస్తున్నట్లు మినిట్స్​ రాసి, రిపోర్ట్​ చేయాలని ఆదేశించింది.  6న యాదగిరి వస్తారని భావిస్తున్న తరుణంలో అంతకన్నా ముందు ఉదయం 9గంటలకే రిజిస్ట్రార్​ కుర్చీలో నిర్మలాదేవి కూర్చున్నారు. అదే రోజు ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయ్స్​ జీతాల చెక్కుపై సంతకం చేసి వెళ్లారు. సోమవారం కూడా ఆమె వస్తారని భావించగా, అంతకంటే ముందే యాదగిరి వచ్చి కూర్చున్నారు. 

ఆధిపత్యపోరుతో ఆగిపోయిన జీతాలు

ఈసీ, వీసీ ఆధిపత్య పోరుతో బ్యాంకర్లకు తిప్పలు వచ్చి పడ్డాయి. వర్సిటీ ఫైనాన్స్​ వ్యవహారాలు రిజిస్ట్రార్​ చూస్తారు.  ఉద్యోగుల జీతాలు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇచ్చే బాధ్యత ఆ చైర్​దే.  1వ తారీఖు దాటిపోయినా జీతాలు లేవని 276 మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. నగదు డ్రా చేయడానికి ఒక వైపు నిర్మలాదేవి మరో పక్క యాదగిరి చెక్కులు పంపడంతో బ్యాంకర్స్​ కన్​ఫ్యూజన్​లో పడ్డారు.  ఎవరి చెక్కును ఓకే చేయాలో తెలియక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది.  యాదగిరే రిజిస్ట్రార్​ అని గవర్నమెంటు నుంచి సోమవారం మెయిల్​ వచ్చినా బ్యాంకర్లలో అనుమానాలు పోలేదు.  విషయాన్ని తమ పైస్థాయి అధికారులకు చేరవేశారు. 

హైదరాబాద్ ​స్థాయిలో చక్రం..

వర్సిటీలో నెలకొన్న వివాదాలు తెలిసి కూడా నిర్మలాదేవి రిజిస్ట్రార్​గా చార్జి తీసుకోవడం, ఈసీలో భాగస్వామ్యులైన పెద్దాఫీసర్లకు  చికాకు తెప్పించింది.  తమ అనుమతి లేకుండా ఈసీ మీటింగ్​కు వెళ్లారని వర్సిటీలోని ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్​ ప్రొఫెసర్​కు రెండు రోజుల గడువుతో క్రమశిక్షణ నోటీసులు సర్వ్​ చేయడంతో వారికి మరింత ఆగ్రహం కలిగించింది. దీంతో హైదరాబాద్ ​స్థాయిలో నిర్మలాదేవికి చెక్​ పెట్టినట్లు భావిస్తున్నారు.  వీసీ రవీందర్ అవినీతిని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వేలుపెట్టడమంటే  మున్ముందు సర్వీసును ఇబ్బందుల్లోకి నెట్టుకోవడమే అవుతుందని ఆమెను హెచ్చరించడం వల్లే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మలాదేవి సోమవారం ఓయూలో (పూర్వస్థానంలో) జాయినింగ్​ రిపోర్టు ఇచ్చారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిరేపుతోంది.