చట్టసభల్లో సమర్థ స్త్రీ శక్తి

చట్టసభల్లో సమర్థ స్త్రీ శక్తి

యూరోప్, ఇంగ్లాండ్, ఇటలీ, న్యూజీలాండ్ వంటి దేశాలు 18, 19 శతాబ్ద కాలంలో మహిళలు ఓటు హక్కు కోసం పోరాటాలు చేశారు. వారి పోరాటాలు చూసి ఓటు  హక్కు ఇవ్వటం జరిగింది.  ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఓటు హక్కు కాదు కదా కనీసం చదువుకునే హక్కు కూడా లేదు .1947 లో బ్రిటిష్ వాళ్ళను వెళ్లగొట్టిన తరువాత 1950 లో భారత దేశ రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు ఎలాంటి పోరాటాలు లేకుండానే భారతీయ  స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. యూరోప్ వంటి దేశాల్లో ప్రకృతి ఆరాధనను అనుసరించే సమూహానికి చెందిన  స్త్రీలను ‘ విచ్ హంటింగ్’  పేరిట  సజీవ దహనం చేసే వారు.

అదేవిధంగా ఇంకా కొన్ని దేశాల్లో  స్త్రీని చాందస వాద  భావాలతో కేవలం కోరికలు తీర్చుకుని, పిల్లలను కనే  యంత్రంగా మాత్రమే చూసారు. ఇప్పటికీ కొన్ని సమాజాల్లో అలాగే  చూస్తున్నారు కూడా. భారత దేశంలో  పూర్వం నుంచే  సమాజం స్త్రీని సహజంగా దేవీ స్వరూపంగా చూడటం జరిగింది. స్త్రీ కి గౌరవ ఇవ్వడం ఈ సంస్కృతి లో భాగంగా ఉన్నది .  

భారతీయ మహిళలు చట్ట సభలను నడపగల సమర్థులు

స్వాతంత్ర ఉద్యమం సమయంలో,  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత సమాజం చాలా సులువుగా అనేక మంది మహిళలను ముఖ్యమైన బాధ్యతలతో ప్రధానిగా, ముఖ్యమంత్రులుగా,  పార్టీల నేతలుగా అంగీకరించింది. అవసరానికి అనుగుణంగా వంటింటి గరిట  తిప్పే భారతీయ స్త్రీ కలం, ఖడ్గం కూడా తిప్పగలిగే శక్తి స్వరూపిణి. పరిపాలన విషయంలో  స్త్రీలు పాల్గొనాలి అని వేదం లో చెప్పబడింది. పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో  స్త్రీలు కూడా పాల్గొనాలి అని  అధర్వణవేదం 7.38.4 లో  చెప్పబడింది. దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి అని ఋగ్వేదం 10.85.46-. లో కూడా పేర్కొనడం జరిగింది . భారతీయ స్త్రీలు కుటుంబానికి  ప్రాముఖ్యత ఇస్తూ, చట్ట సభలను కూడా నడపగలరు. రాజకీయాల్లో కూడా స్త్రీలు రాణించగలరు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆధారంగా వారసత్వ రాజకీయాలు కాకుండా సామర్ధ్యం ఉన్న మహిళలను ముందుకు రానివ్వడం కోసం అందరూ ప్రయత్నించాలి. సమాజం కూడా అలాంటి వారిని ప్రోత్సహించాలి.

ప్రపంచంలో గొప్పనైనది   ప్రకృతి ఆరాధన సంస్కృతి సనాతన ధర్మం. సనాతన ధర్మం భారతదేశ ఆత్మ. అందుకే మన దేశాన్ని  కూడా తల్లితో పోలుస్తూ  భారతమాత అని పిలుస్తారు. ప్రకృతి ఆరాధనలో ప్రకృతితో పాటు, ప్రకృతి స్వరూపమైన స్త్రీ ఆరాధన కూడా ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచమంతా ప్రకృతి ఆరాధన ఉండేది. పాశ్చాత్య , ఎడారి దేశాల్లో కొత్త మతాలు పుట్టి అనేక చోట్ల  ప్రకృతి ఆరాధన పద్ధతిని దారి తప్పించారు. కానీ భారతదేశంలో ఇంకా ప్రకృతి ఆరాధన, సనాతన ధర్మ సంస్కృతి మిగిలి ఉండటానికి కారణం ఈ దేశ స్త్రీ మూర్తులే. ఈ సంస్కృతిని కాపాడుతూ, కుటుంబాన్ని నడిపిస్తూ  ముందు తరాలకు అందించే బాధ్యతని అలుపెరగకుండా కృషి చేస్తోంది భారతీయ నారీలోకం. దానికి ప్రపంచమంతా రుణపడాల్సి ఉంది. 

స్త్రీలకు వేదాలే  అన్ని  హక్కులు కల్పించాయి

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా; యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తతాఫలా: క్రియా: సనాతన ధర్మంలో అనేక వేల  సంవత్సరాల నాటి నుంచే  స్త్రీలు అన్ని రంగాల్లో అంటే విద్య నేర్పడంలో  రాజ్య పరిపాలనలో వుండేవారు. అక్బర్ ని రాణి దుర్గావతి మూడుసార్లు యుధ్ధ భూమి నుంచి పారిపోయేలా వీరోచితంగా పోరాడింది. స్త్రీలు కూడా రథాలను నడపాలి అని  అధర్వణవేదం 9.9.2 లో ఉన్నది. స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజుర్వేదం 16.44. ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.ఝాన్సీ లక్ష్మీబాయి 1857 లో బ్రిటిష్ వారిని తన సైన్యంతో కలిసి తన్ని తరిమేసింది.  భారత్ లోని గురుకులాల్లో  రుషికలు అయిన  గార్గి, రోమష, ఘోషా, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి వంటివారు గురుకులాల్లో అన్ని విషయాలను బోధించేవారు.

భారత దేశ విద్యా వ్యవస్థలో మహిళా విద్యార్ధినుల శాతంతో పాటు ఋషికల  శాతం కూడా ఎక్కువ ఉండేది. వేదకాలంలో మహిళలు గురుకులాలు కూడా నిర్వహించారు. కృష్ణుడు లాంటి వారిని తయారు చేసిన యశోదల నుంచి మొదలుకొని శివాజీ లాంటి వీరులను తయారు చేసిన  జిజియాబాయి లాంటి మాతృమూర్తులకు భారతదేశంలో కొదవ లేదు. మన సనాతన ధర్మంలో  అన్ని  రంగాల్లో  స్త్రీ ముందంజలో అంటే పురుషుడితో సమానంగా అనే కంటే ఒక రకంగా ఎక్కువ గానే ఉన్నది అని చెప్పుకోవచ్చు.

ఇక్కడి సమాజం స్త్రీ ని విశ్వసించింది,  గౌరవించింది.  అయితే మన సమాజం పై విదేశీ ఆక్రమణకారులు దాడి చేసిన ప్రతిసారి ఇక్కడి స్త్రీలను చెరపట్టడం అత్యాచారాలు చెయ్యడం వంటివి చేశారు.  దాని కారణంగా స్త్రీ సమాజంలో నిర్వహించే బాధ్యతలకు పరిమితులు ఏర్పడ్డాయి. 

- మౌనిక సుంకర శక్తి వాహిని