న్యూఢిల్లీ: మార్కెట్లోకి కొత్త పంటలు రావడంతో కూరగాయల ధరలు వచ్చే నెల నుంచి తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఇన్ఫ్లేషన్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గోధుమలు, బియ్యం నిల్వలను మార్కెట్లకు పంపిస్తోంది. బియ్యం, చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. పప్పుధాన్యాలు, నూనెగింజల దిగుమతులను అనుమతించింది. ధరలను తగ్గించడానికి అనువైన వాణిజ్య విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ఆహార ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆహార ధాన్యాల సరఫరా తగ్గింది. భారతదేశం కూడా ఇబ్బందిపడుతోంది.
అయితే ఇతర దేశాలతో పోలిస్తే మనం పరిస్థితి చాలా బెటర్”అని అధికారి చెప్పారు. టమాటా ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, రానున్న నెలల్లో మరింత తగ్గుతాయని అన్నారు. త్వరలో మరో టమాటా పంట చేతికి వస్తుంది కాబట్టి ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటానికి కూరగాయల ధరలే కారణమని, వీటి ధరలు త్వరగా తగ్గుతాయని వివరించారు. రిటైల్ ఇన్ఫ్లేషన్ జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది, జూన్లో 4.87 శాతంగా ఉంది.
భారీగా ఉల్లి నిల్వలు..
ఉల్లి ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023-–24 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల టన్నుల ఉల్లిపాయల సేకరణను టార్గెట్గా పెట్టుకుంది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది. స్థానిక సరఫరాలను మెరుగుపరచడానికి, వాటి ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది.
ఇదిలా ఉంటే ముడి చమురు ధరలు (బ్యారెల్కు 90 డాలర్లు) తట్టుకోగలిగేలానే ఉన్నప్పటికీ, ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చమురుపై ఎక్సైజ్ సుంకం తగ్గించే అవకాశం లేదని అన్నారు. ప్రభుత్వం ఇన్ఫ్రా కోసం భారీగా పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు మరింత పెరగాల్సి ఉందని అన్నారు. జూన్ క్వార్టర్ చివరి నాటికి బడ్జెట్ అంచనాలలో 28 శాతం ఉన్న మూలధన వ్యయం సెప్టెంబర్ చివరి నాటికి 50 శాతానికి చేరుకుంటుంది.