దశాబ్దిలోకి తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం కోసం ఇందిరను కలిసి..

దశాబ్దిలోకి  తెలంగాణ  : తెలంగాణ రాష్ట్రం  కోసం ఇందిరను కలిసి..

పోలీస్ ​యాక్షన్ ​తర్వాత నాలుగేండ్లకు హైదరాబాద్‌ శాసనసభకు మొదటిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ మొత్తం175 స్థానాలకు173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వాటిలో 93 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పూర్తి మెజారిటీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 42 స్థానాలతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రతిపక్ష కూటమిగా నిలిచింది. 1952, మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు సీఎంగా హైదరాబాద్‌లో తొలి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్​అవతరణ జరిగింది. ఆ సమయంలో ఆంధ్రాను తెలంగాణతో కలిపే సమయంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం అంశాలు అమలుకు నోచుకోకపోవడం, ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి కింద శిక్షణ పొందిన అనుభవం ఉన్న అధికారులను తెలంగాణకు రప్పించడం, అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇవ్వడం, స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరంకావడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నిప్పు రాజుకుంది. 

మర్రి చెన్నా రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం వీహెచ్ దేశాయి ఓ పోరాట వేదికను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఎంపీలుగా ఉన్న జీఎస్​మేల్కోటే, జి. వెంకటస్వామి(కాకా) నేతృత్వంలో వీహెచ్​ దేశాయి బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి ఇందిరాను కలిశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రిప్రెజంటేషన్​అందజేసి, సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ సఫరర్స్​వెల్ఫేర్​కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్​ఫ్రీడం ఫైటర్స్​ఫోరమ్(1972)​కు ఫౌండర్​ ప్రెసిడెంట్​గా పనిచేశారు. ఆలిండియా ఫ్రీడం ఫైటర్స్​ అసోసియేషన్​కు జనరల్​సెక్రటరీగా చేశారు. కొండా లక్ష్మణ్​ బాపూజీ, కాళోజీ నారాయణ రావు, కొత్తపల్లి జయశంకర్, రావి నారాయణ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పీవీ నర్సింహారెడ్డి లాంటి నేతలతో కలిసి తెలంగాణ ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేశారు.

– కాశెట్టి కరుణాకర్, వెలుగు ప్రతినిధి