
చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ గోల్డ్ స్కామ్ బాధితులు గురువారం ఉదయం బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్కామ్ జరిగి నెలలు గడుస్తున్నాయని, తమ నగలు రికవరీ చేసి నెల గడిచినా తమ ఆభరణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రికవరీ చేసిన బంగారాన్ని రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి నెల గడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంక్ ఆఫీసర్లు బంగారం ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బ్యాంక్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమస్యను త్వరలోనే పరిష్క రిస్తామని బ్యాంక్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.