సిద్దిపేట, వెలుగు: రేవంత్ పాలనలో రెండేళ్లలో గ్రామాలు మురికికూపాలుగా మారాయని మాజీ మంత్రి హారీశ్ రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించి మాట్లాడారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకుపోయిన చెత్తను తీసే బాధ్యత ప్రస్తుత సర్పంచులపై పడిందన్నారు. జీపీలకు వెంటనే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2017కు ముందు నియోజకవర్గంలో యాసంగిలో 8 వేల ఎకరాల్లో వరి సాగు చేసే వారని, కాళేశ్వరం ప్రాజక్టుతో నేడు 80 వేల ఎకరాలు సాగవుతోందన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపి గులాబీ జెండా ఎగుర వేశామని తెలిపారు. బీజేపీ దక్షిణాదిలో పట్టు సాధించాలని చూస్తోందని, ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆశలు వదులుకున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
