లంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా కోహ్లీ సెంచరీల మోత మోగించాడు. తొలి వన్డేలో శతక్కొట్టిన కింగ్ కోహ్లీ..మూడో వన్డేలోనూ దుమ్ము రేపాడు. ఏకంగగా 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ సెంచరీతో మరో కొన్ని రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డుకు కేవలం మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ఓవరాల్గా 74 సెంచరీ నమోదు చేసి సచిన్ 100 సెంచరీల రికార్డు అధిగమించే దిశగా దూసుకెళ్తున్నాడు. కోహ్లీ 259 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ 46 సెంచరీలు బాదగా.. 452 ఇన్నింగ్స్ల్లో సచిన్ 49 శతకాలు నమోదు చేశాడు.
విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. గతంలో పాక్ పై చేసిన 183 పరుగులే అత్యధికం. ఇక శ్రీలంకపై 10 వన్డే సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా కోహ్లీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు గ్రీన్ ఫీల్డ్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. తన వన్డే కెరీర్లో ఓ ఇన్నింగ్స్లో 8 సిక్సులు కొట్టాడు. అంతేకాదు కోహ్లీ చేసిన 46 అంతర్జాతీయ వన్డే శతకాల్లో 21 సెంచరీలు భారత్లో చేసినవే కావడం విశేషం. ఇలా ఒకే దేశంలో అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ భారతదేశంలో 20 సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇప్పుడు ఈ రికార్డును కూడా అధిగమించాడు.
వన్డేల్లో నాలుగుసార్లు 150 ప్లస్ పరుగులతో అజేయంగా నిలిచిన ఏకైక ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు కోహ్లీ వన్డేల్లో ఐదు సార్లు 150+ స్కోర్లు నమోదు చేశాడు. ఇక చివరి నాలుగు వన్డేల్లో కోహ్లీ 3 సెంచరీలు బాదడం విశేషం. బంగ్లాదేశ్పై 113, శ్రీలంకపై 113, 166 పరుగులు చేశాడు. అటు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650) పరుగులను కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 12754 పరుగులు సాధించాడు.