ఒక్క మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేదికైంది. ఒక్క ఇన్నింగ్స్..ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ..అనేక రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. తద్వారా..సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో 23 హాఫ్ సెంచరీలు సాధించగా..కోహ్లీ తాజా హాఫ్ సెంచరీతో ఆ రికార్డును తిరగరాశాడు. కోహ్లీ ఇప్పటి వరకు 24 అర్దసెంచరీలు సాధించాడు. దీంతో ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
రోహిత్ను దాటేసిన కోహ్లీ
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. పాక్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగులు చేయడం ద్వారా టీ20ల్లో టాప్ స్కోరర్గా అవతరించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దాటేశాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 110 మ్యాచుల్లో 3,794 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ -3,741 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ -3,531 రన్స్తో మూడో ప్లేస్లో ..బాబర్ ఆజమ్- 3,231 పరుగులతో నాల్గో స్థానంలో... పాల్ స్టిర్లింగ్-3,119 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
కోహ్లీ...ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్..
పాక్పై అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది విరాట్ కోహ్లీనే. ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్పై కోహ్లీ అత్యధికసార్లు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్ అవార్డులు గెలుచుకున్న వారిలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ ముందు లక్ష్యం చిన్నదైపోతుంది...
టీ20ల్లో ఎక్కువసార్లు 50కి పైగా రన్స్ చేసిన రికార్డును కోహ్లీ నెలకొల్పాడు.35 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. అంతేకాకుండా టీ20ల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ 18 సార్లు నాటౌట్గా నిలిచాడు. అందుకే కోహ్లీ ఉన్నాడంటే..ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్నదైపోతుంది.