- ఈ అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న సుప్రీంకోర్టు
 
    
న్యూఢిల్లీ:  అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలే కాకుండా మొత్తం  బకాయిలపై  రాయితీ ఇవ్వాలని  వొడాఫోన్ ఐడియా (వీ) కోరిందని, ఈ అంశాన్ని పరిశీలించడానికి  ప్రభుత్వం సుముఖంగా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వీ షేర్లు సోమవారం 10 శాతం పెరిగి రూ.9.54కి చేరాయి.   
వొడాఫోన్ ఐడియా రూ.9,450 కోట్ల అదనపు ఏజీఆర్ బకాయిలపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) నోటీసులను సవాల్ చేస్తూ, వడ్డీ, జరిమానాల మాఫీ కోరింది. కంపెనీకి రూ.83,400 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఉన్నాయి. మార్చి 2026 నుంచి సంవత్సరానికి రూ.18 వేల కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. వడ్డీ, జరిమానాలతో కలిపి మొత్తం బకాయిలు రూ.2 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ఇంతకుముందు వొడాఫోన్ ఐడియా కేవలం అదనపు ఏజీఆర్ బకాయిలపై మాత్రమే రాయితీ కోరిందని కోర్టు భావించింది. 2020 లో అమల్లోకి వచ్చిన డిడక్షన్ వెరిఫికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2016–--17 వరకు మొత్తం బకాయిలను మళ్లీ లెక్కించాలని వొడాఫోన్ ఐడియా కోరుతోంది.
వీ లోకి కొత్త పెట్టుబడులు?
అమెరికన్ పీఈ కంపెనీ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) వొడాఫోన్ ఐడియాలో 400–600 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఆపరేషనల్ కంట్రోల్ తీసుకోవాలని చూస్తోంది. అయితే, ఇది ప్రభుత్వ ప్యాకేజీపై ఆధారపడి ఉంటుంది. డీల్ జరిగితే, టీజీహెచ్ ప్రమోటర్ హోదా పొందుతుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. వీలో ప్రభుత్వం 48.99శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 9.50శాతం, వొడాఫోన్ పీఎల్సీ 16.07శాతం వాటాలు కలిగి ఉన్నాయి.
