భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో జీపీఎస్ ట్యాగ్తో ఉన్న రాబందు కనిపించడం కలకలం రేపింది. చర్ల మండలం తిప్పాపురం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ పరిసర ప్రాంతంలో జీపీఎస్ ట్యాగ్ అమర్చిన రాబందును గుర్తించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ శాఖ సిబ్బంది పక్షిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఈ రాబందు ఛత్తీస్గఢ్ అడవుల నుంచి సంచరిస్తూ ఇక్కడికి చేరి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వన్యప్రాణుల కదలికలు, వలస మార్గాలపై అధ్యయనం కోసం పరిశోధకులు జీపీఎస్ ట్యాగ్లు అమర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, గతంలో కూడా ఇలాంటి జీపీఎస్ ట్యాగ్ కలిగిన మరో పక్షి చర్ల మండలంలో కనిపించడం గమనార్హం.
