రిటర్న్‌‌లపై లేటు ఫీజులు ఎత్తివేత

రిటర్న్‌‌లపై లేటు ఫీజులు ఎత్తివేత

లేటు పేమెంట్లపై వడ్డీ తగ్గింపు
జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌‌లో నిర్మల వెల్లడి
వచ్చేనెల మళ్లీ స్పెషల్ మీటింగ్
రాష్ట్రాల పరిహారాలపై నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ : జీఎస్టీ రిటర్న్స్‌‌కు సంబంధించి లేటు ఫీజుల విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఊరటనిచ్చారు. వ్యాపారాలకు పన్ను భారాన్ని తగ్గించేందుకు…ట్యాక్స్ లయబులిటీ లేని వారికి రిటర్న్‌‌ల విషయంలో లేటు ఫీజులను పూర్తిగా ఎత్తివేయడం, ట్యాక్స్ లయబులిటీ ఉన్న వారికి లేటు ఫీజులను తగ్గించడం వంటి వాటిని నిర్మలా ప్రకటించారు. ట్యాక్స్ లయబులిటీ లేని వారు జూలై 2017 నుంచి జనవరి 2020కు సంబంధించిన జీఎస్టీ రిటర్న్‌‌లను ఆలస్యంగా ఫైల్ చేస్తే వారికి ఎలాంటి లేట్ ఫీజులు ఉండవని శుక్రవారం నిర్మలా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా ట్యాక్స్ లయబులిటీ ఉన్నా ఒక్కో రిటర్న్‌‌కు గరిష్టంగా విధించే లేటు ఫీజును రూ.500కు కుదించినట్టు వెల్లడించారు. 2020 జూలై 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 వరకు రిటర్న్‌‌లు సమర్పించే వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు.

2017 జూలై నుంచి 2020 జనవరి వరకున్న కాలానికి సంబంధించి చాలా రిటర్న్‌‌లు పెండింగ్‌‌లో ఉన్నాయి. లాక్‌‌డౌన్‌‌ తర్వాత తొలిసారి నిర్మలా నేతృత్వంలో 40వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపారు. ఈ మీటింగ్‌‌లోనే చిన్న పన్ను చెల్లింపుదారులకు కూడా నిర్మలా సీతారామన్ ఉపశమన చర్యలు ప్రకటించారు. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులు 2020 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌‌ నెలలకు సంబంధించి జీఎస్టీ రిటర్న్‌‌లను ఆలస్యంగా ఫైల్ చేస్తే 2020 జూలై 6వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సినవసరం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి 2020 సెప్టెంబర్ వరకు కేవలం 9 శాతమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. అంతకుముందు ఈ వడ్డీ రేటు 18 శాతంగా ఉండేది. అదేవిధంగా మే, జూన్, జూలైలకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్‌‌ల ఫైలింగ్‌‌ల తుది గడువును ఎలాంటి లేటు ఫీజులు, వడ్డీలు లేకుండా సెప్టెంబర్ వరకు పొడిగించినట్టు తెలిపారు.

రాష్ట్రాల పరిహారాలపై జూలైలో చర్చ…

జీఎస్టీ కలెక్షన్లు 45 శాతం మేర తగ్గిపోయినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు పరిహారాలు అందించడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మార్కెట్ బారోయింగ్ ద్వారా ఫండ్స్ ను అందించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఇష్యూపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ స్పెషల్‌‌గా మరోసారి జూలైలో కూడా సమావేశం కానుందని వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి కాలానికి కంపెన్జేషన్ సెస్ కింద రాష్ట్రాలకు కేంద్రం రూ36,400 కోట్లు విడుదల చేసినట్టు నిర్మలా తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి రూ.1.51 లక్షల కోట్లని, వాటిలో మార్చి ఇన్‌‌స్టాల్‌‌మెంట్ మాత్రమే పెండింగ్‌‌లో ఉన్నట్టు చెప్పారు. 2019 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.1.15 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసినట్టు తెలిపారు. తదుపరి మీటింగ్‌‌లోనే పాన్ మసాలాపై ఉన్న పన్ను చెల్లింపులను చర్చించనున్నామని నిర్మలా తెలిపారు. టెక్స్‌‌టైల్, ఫుట్‌‌వేర్, ఫెర్టిలైజర్స్ పై ఉన్న జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ విషయాన్ని ప్రస్తుతానికి జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసింది.

తగ్గిపోయిన కలెక్షన్లు…

కరోనా లాక్‌‌డౌన్ జీఎస్టీ కలెక్షన్లను దెబ్బకొట్టింది. ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. నెలకు పెట్టుకున్న రూ. లక్ష కోట్ల టార్గెట్‌‌ బాగా పడిపోయింది. లాక్‌‌డౌన్ కాలంలో జీఎస్టీ కలెక్షన్లతో ఒకవైపు రెగ్యులర్, ఎక్స్‌‌ట్రాడినరీ ఖర్చులను సర్దుకురావడమే కాకుండా.. మరోవైపు నష్టపోయిన వ్యాపారాలకు రిలీఫ్ ఇచ్చేందుకు చూసినట్టు నిర్మలా చెప్పారు. ‘రాష్ట్రాలు కూడా జీఎస్టీ కలెక్షన్లు చేపడతాయి. ప్రతి నెలా ఎంత మొత్తం వస్తుందో వాటికి కూడా తెలుసు. రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయి’ అని రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

‘నిల్’ రిటర్న్‌‌లకు ఎస్‌‌ఎంఎస్‌‌ చాలు..

జీఎస్‌‌టీ రిటర్న్ దాఖలును మరింత సులభతరం చేసేందుకు నిల్ జీఎస్‌‌టీఆర్ -3బీ రిటర్న్‌‌ను ఎస్‌‌ఎంఎస్ ద్వారా దాఖలు చేసే సదుపాయాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌‌వర్క్ (జీఎస్‌‌టీఎన్) తీసుకువచ్చింది. తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. తమ దగ్గర నుంచి ఎలాంటి ఔట్‌‌వార్డ్ సప్లయి, అలాగే లయబిలిటీ (రివర్స్ చార్జ్ లయబిలిటీ సహా) ఒక నెలలో లేకుంటే నిల్ జీఎస్‌‌టీఆర్-3బీ దాఖలు చేయవచ్చు. ఈ సదుపాయం ద్వారా 20 లక్షల మందికి పైగా జీఎస్‌‌టీ పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని అంచనా. ‘మొత్తం జీఎస్‌‌టీ చెల్లింపుదారుల్లో 20శాతం మందికి లబ్ది చేకూరనున్నది. మేము తీసుకువచ్చిన ఎస్ఎంఎస్ ఫైలింగ్‌‌తో వ్యాపారాలకు జీఎస్‌‌టీ విధానం మరింత సులభతరం అవుతుంది” అని జీఎస్‌‌టీఎన్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన‌ వ్యక్తి అరెస్టు