వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల వద్ద ఉన్న చేయూత అనాథాశ్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన తల్లిదండ్రులు సాయిరెడ్డి, వెంకటమ్మల జ్ఞాపకార్థం మొబైల్ వెహికల్ను అందించారు. రూ.6 లక్షలు విలువైన టాటా మొబైల్ వెహికల్ను ఆదివారం అప్పగించారు.
చేయూత అనాథాశ్రమం నుంచి చుట్టుపక్కల గ్రామాల్లోని అనాథ వృద్ధులకు ప్రతి రోజూ భోజనం అందించేందుకు ఈ వాహనాన్ని ఉపయోగించనున్నట్లు నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆశ్రమానికి వాహనాన్ని అందించి ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలో అనాథ యువతి పెళ్లికి ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
2004లో అనాథగా ఆశ్రమంలో చేరిన మాధవి వివాహం జటప్రోలు గోపులాపురం గ్రామానికి చెందిన సందీప్ రెడ్డితో జరిపించారు. అనాథను చేరదీసి పెద్ద చేసి పెండ్లి చేసిన నిర్వాహకుడిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, చిన్నమందడి మాజీ సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్, నాయకులు ఎల్ సతీశ్, రహీం, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, ఆదిత్య పాల్గొన్నారు.
