వరంగల్​ స్టేషన్​కు కాకతీయ కళ .. ఏప్రిల్ 15న వరంగల్​ మోడల్​ రైల్వే స్టేషన్‍ ఓపెనింగ్‍

వరంగల్​ స్టేషన్​కు కాకతీయ కళ .. ఏప్రిల్ 15న వరంగల్​ మోడల్​ రైల్వే స్టేషన్‍ ఓపెనింగ్‍
  • అమృత్ భారత్ స్కీంలో రూ.25.41 కోట్లతో హైఫై డెవలప్‍మెంట్‍
  • అత్యాధునిక ఫుట్‍ ఓవర్​ ‍బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‍ఫారాలు 
  •  ప్రారంభానికి రెడీగా వరంగల్, పెండింగులో కాజీపేట, జనగామ, మహబూబాబాద్‍  
  • వర్చువల్‍గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే వరంగల్​ రైల్వే స్టేషన్‍ సరికొత్త హంగులతో  ప్రారంభానికి రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం అమృత్​ భారత్​ స్కీంలో భాగంగా తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. దక్షిణమధ్య రైల్వే ఆఫీసర్లు వరంగల్‍, కాజీపేట జంక్షన్‍, మహబూబాబాద్‍, జనగామ ​రైల్వే స్టేషన్లను ఆధునీకరణకు ఎంపిక చేశారు. ఇందులో వరంగల్​ స్టేషన్‍ పనులు చివరి దశకు చేరాయి. అత్యధునిక ఫుట్‍ఓవర్​​ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలు ఫ్లాట్​ ఫారం కప్పులు, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. స్టేషన్​ ముందు ప్రాంతం వెడల్పుగా చేయడానికితోడు కాకతీయ కళా సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‍గా ప్రారంభించనున్నారు. 

ఓరుగల్లులో 4 స్టేషన్లు..  

అమృత్ భారత్ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అత్యధునీకరిస్తున్నారు. అందులో ఓరుగల్లులో వరంగల్​ స్టేషన్​ కోసం రూ.25.41 కోట్లు, కాజీపేట జంక్షన్‍రూ.24.45 కోట్లు, జనగామ రూ.24.5 కోట్లు, మహబూబాబాద్‍ స్టేషన్​ పనులకు రూ.39.72 కోట్లు కేటాయించడంతో పనులు 
జెట్​ స్పీడుతో సాగుతున్నాయి. ఇందులో వరంగల్​ స్టేషన్​ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి 
సిద్ధమైంది. 

డైలీ 137 రైళ్లతో.. 31 వేల మంది జర్నీ

వరంగల్ సిటీ హెడ్‍క్వార్టర్‍గా ఉండే వరంగల్​ రైల్వే స్టేషన్‌  దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపేలా గొప్ప చరిత్ర ఉంది. సికింద్రాబాద్​ డివిజన్‍ పరిధిలోకి వచ్చే ఈ స్టేషన్​లో నాలుగు ప్లాట్​ ఫారాలున్నాయి. ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయంతోపాటు రోజుకు దాదాపు 31,887 మంది ప్రయాణీకుల రాకపోకలు సాగిస్తున్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రైసిటీతోపాటు ఉమ్మడి వరంగల్‍, కరీంనగర్‍ నుంచి వచ్చే ప్రయాణీకులకు సేవలందిస్తోంది. వరంగల్ స్టేషన్‌లో దాదాపు 137 రైళ్లు ఆగుతాయి. వరంగల్​ స్టేషన్‍  మీదుగా ప్రధానంగా న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి అనేక మార్గాల్లో సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నారు.

రూ.25.41 కోట్లతో హైఫై ఫెసిలిటీస్‍.. 

అమృత్‍  భారత్‍ స్కీంలో భాగంగా వరంగల్​ రైల్వే స్టేషన్​లో అత్యధునిక పనుల కోసం రూ.25.41 కోట్ల ఫండ్స్​ఇచ్చారు. విశాలమైన కాన్​ కోర్స్​, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్ట్‌ రూమ్‌లతో సహా ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని పంచేలా స్టేషన్​ను రూపొందిస్తున్నారు. స్టేషన్ భవనానికి ఆకర్షణీయమైన ఎంట్రెన్స్​ నిర్మించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్​ఫారాలను ఆధునీకరించారు. వాటిపై అదనపు కప్పులు ఏర్పాటు చేశారు. మోడల్‍  టాయిలెట్లతోపాటు దివ్యాంగులకు సౌకర్యాలు, వారికి కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మిస్తున్నారు. వెయిటింగ్ హాల్‌నిర్మాణం చేపట్టారు. స్టేషన్​ ఆవరణలో ఆహ్లాద పరిచే ల్యాండ్​స్కేప్​, కాకతీయుల నాటి కళలు, సంస్కృతి ఉట్టిపడే చిత్రాలు ఏర్పాటు చేశారు.