
హాలియా, వెలుగు : నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్లోకి 2,93,906 క్యూసెక్కుల నీరువస్తుండగా... 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,68,004 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే మెయిన్ పవర్హౌజ్ ద్వారా 28,664 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,144, కుడికాల్వకు 7,894 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. గేట్లను ఓపెన్ చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నది ఒడ్డున సరదాగా గడుపుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు చర్యలు
చేపట్టారు.
ఎల్లంపల్లిలో పెరుగుతున్న నీటిమట్టం
మంచిర్యాల, వెలుగు : భారీ వర్షాలు పడుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి 5,8,96 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.542 టీఎంసీల నీరు చేరింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ మెట్రోవాటర్ స్కీమ్కు 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.