పంజాబ్ ‘ఆప్ ’ పాలనలో ఏం జరుగుతోంది? : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

పంజాబ్ ‘ఆప్ ’ పాలనలో ఏం జరుగుతోంది? : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

దేశంలో బిజెపి, కాంగ్రెస్‌‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏమిటి? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బిజెపి కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, సగానికి పైగా రాష్ట్రాల్లో పాగా వేయడం మరో పక్క కాంగ్రెస్‌‌ పూర్తి బలహీనపడటంతో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్‌‌ సీఎం నితీష్‌‌ కుమార్‌‌ ఒకవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరాల కూర్పుకు యత్నిస్తున్నారు.  బెంగాల్‌‌ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ అటువంటి యత్నాలతో కలిసి రావటం లేదు.  సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ విభిన్న రాజకీయాలకోసం అఖిల భారత స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌‌ గెలుపు తర్వాత హిమాచల్‌‌ప్రదేశ్‌‌, ఉత్తరాఖాండ్‌‌, గుజరాత్‌‌ వంటి రాష్ట్రాలపై కన్నేసి కేజ్రీవాల్‌‌ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. అటు పూర్తి రాష్ట్రం, ఇటు  కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఉన్న ప్రత్యేకత ఢల్లీది. పంజాబ్‌‌లో భారీ మెజార్టీతో గెలవటం ‘ఆప్‌‌’ ఎదుగుదలకు కలిసిరావడమే కాకుండా ఒక సవాల్‌‌గా కూడా మారింది. మిగతా రాష్ట్రాలకు ‘ఆప్‌‌’ విస్తరించడానికి పంజాబ్ ఒక ప్రయోగశాల వంటిదే. అక్కడ ఆరు నెలల ఆప్‌‌ పాలన ఇప్పుడు రాజకీయ సమీక్షకు నిలవాల్సి వస్తోంది.  ఇందులో భాగంగా ‘ఢిల్లీ మోడల్‌‌’ పాలనను ప్రచారం చేసి పంజాబ్‌‌లో కాంగ్రెస్‌‌ను ఓడించి అధికారం చేపట్టింది. ఇదే ఊపును ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగించాలని ఆశ పడుతున్నది. త్వరలో జరగనున్న గుజరాత్‌‌, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధమవుతోంది. పంజాబ్‌‌ ప్రభుత్వ పనితీరును ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో  ప్రచారం చేసి లాభపడాలని ప్రయత్నిస్తున్నది. పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే ఆప్‌‌ ప్రభుత్వం పంజాబ్‌‌లో అనుకున్నది సాధించిందా అని పరిశీలిస్తే ఇంత తక్కువ సమయంలో సాధించిన ప్రగతిని, లోటుపాట్లను బేరీజు వేయడం తొందరపాటే అవుతుంది. పంజాబ్‌‌ ఎన్నికల్లో   కాంగ్రెస్‌‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత  ఆప్‌‌కు కలిసివచ్చింది. ఎన్నికల్లో అనేక హామీలిచ్చింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో  పేరుకుపోయిన అవినీతి, మాఫీయా రాజ్యాన్ని, డ్రగ్‌‌ వ్యవస్థను అరికట్టడంతోపాటు వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసి పంజాబ్‌‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆప్‌‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ‘ఢిల్లీ మోడల్‌‌’ను ముఖ్యంగా ఆరోగ్య, విద్యా రంగాలలో సాధించిన అభివృద్ధిని ఇక్కడ ప్రచారం చేసింది. యువతను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడంతోపాటు ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని, ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ఇస్తామనే కీలకమైన హామీలిచ్చింది.

ఆప్‌‌ హామీల అమలు తీరు..

భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి భగవంత్‌‌ మాన్‌‌ ఆధ్వర్యంలోని ఆప్‌‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పై దృష్టి పెట్టింది. మాన్‌‌ ప్రభుత్వం తొలి చర్యగా అవినీతిని అరికట్టడానికి  ఒక హెల్ప్‌‌లైన్‌‌ నెంబరును ఏర్పాటుచేసింది. దీనికి స్పందనగా చర్యలు తీసుకోబడిన ప్రముఖులలో స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్‌‌ సింఘాల్‌‌ కూడా ఉన్నారు. విచారణ అనంతరం మంత్రిని  బర్తరఫ్‌‌ చేసిన ముఖ్యమంత్రి ఆయనను అరెస్టు చేయించారు. అయితే ప్రస్తుతం మరో ఆప్‌‌ మంత్రి కూడా స్టింగ్‌‌ ఆపరేషన్‌‌లో అవినితీకి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం  గమనార్హం.

‘వీఐపీ’ సంప్రదాయాన్ని తొలగిస్తామని ప్రకటించిన ఆప్‌‌ ప్రభుత్వం మొదటి విడతలో మాజీ ప్రజాప్రతినిధులతో సహా 424 మందికి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించింది. ఈ రక్షణ సిబ్బందిని రాష్ట్రంలో శాంతి భద్రతలకు, అవినీతిని అరికట్టడానికి వినియోగిస్తామని తెలిపింది. అయితే భద్రతా సిబ్బందిని తొలగించిన తర్వాత ప్రముఖ పంజాబ్‌‌ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య జరగడంతో ఆప్‌‌ ప్రభుత్వం పాక్షికంగా ఈ నిర్ణయంపై వెనకడుగు వేసింది. తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా జీతభత్యాలను ప్రకటించలేదు. ఢిల్లీలో చేసినట్టు పంజాబ్‌‌లో కూడా అనేక మోహల్లా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అప్‌‌గ్రేడ్‌‌ చేశారు. డ్రగ్స్‌‌ అంశాన్ని పరిశీలిస్తే ఈ కేసుల్లో భాగస్వాములైన అధికారులతో సహా వేల మందిని అరెస్టు చేయడంతో క్షేత్రస్థాయిలో కొంతమేర పరిస్థితులలో మార్పు కనిపిస్తుంది. ఇక ఆర్థిక రంగాన్ని సమీక్షిస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు భారం ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడింది. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాన్‌‌ జర్మనీ పర్యటించినా ఆశించిన మేరకు మేలు జరగలేదు. రాష్ట్రానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పెసరపప్పు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించడంతో రైతులకు సంవత్సరంలో మూడవ పంట వేసే అవకాశం దక్కింది. మరో ఆసక్తికరమైన అంశం ఆప్‌‌ ప్రభుత్వం ప్రచారానికి పెద్దపీట వేస్తుంది. వార్త పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం, సోషల్‌‌ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికల్లో ఆప్‌‌ అనుకూల వీడియోలను, ట్విట్‌‌లను పెద్దఎత్తున పోస్టు చేస్తూ ప్రచారాన్ని చేసుకుంటుంది. బిజెపి కర్నాటక, మధ్యప్రదేశ్‌‌, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో చేసినట్టు పంజాబ్‌‌లో కూడా ఆప్‌‌ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా ప్రోత్సాహిస్తుందనే వార్తలు రాష్ట్రంలో దుమారం లేపాయి. దీంతో ప్రభుత్వ బల నిరూపణకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గవర్నర్‌‌ను కోరగా ఆయన న్యాయ సలహా మేరకు తిరస్కరించారు. అయితే ఆప్‌‌ ప్రభుత్వం పనితీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని, ఆ ప్రభుత్వాన్ని ఓడించేందుకు వారే సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌‌, బీజేపీ వాదిస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌‌ తరఫున గెలిచిన 20 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది, 2014లో గెలిచిన నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించారు. ఈ సారి అటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఆప్‌‌ జాగ్రత్తపడుతున్నది.

ఎదురవుతున్న సవాళ్లు

రాష్ట్రంలో పార్టీకి కొన్ని అంశాలలో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యమంత్రి మాన్‌‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ ఉప ఎన్నికల్లో సిక్కు వేర్పాటువాద అకాలీ దళ్‌‌ (అమృత్‌‌సర్‌‌) నేత సిమ్రన్‌‌జిత్‌‌ సింగ్‌‌ మాన్‌‌ సంగ్రూర్‌‌ గెలవడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్‌‌కు గట్టి ఎదురుదెబ్బ. దీంతోపాటు అకాలీ తక్త్​ జాతేదార్‌‌ సిక్కు యువతను మత విశ్వాస పరిరక్షణకు ఆయుధాలను చేపట్టాలని పిలుపివ్వడం, బింద్రన్‌‌వాలే పోస్టర్ల బహిరంగ ప్రదర్శన, ‘బండి`సిక్కులను’ విడుదల చేయాలని అకాలీదళ్‌‌ డిమాండ్‌‌ చేయడం వంటివి ఆప్‌‌ ప్రభుత్వానికి సమస్యాత్మకంగా పరిణమిస్తున్నాయి. సిక్కు వర్గాలను సంతృప్తిపర్చడానికి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సరిహద్దుల అవతల నుండి డ్రోన్‌‌  ద్వారా జారవిడుస్తున్న ఆయుధాలు, నకిలీ కరెన్సీ, డ్రగ్స్‌‌ సరఫరా వంటి అంశాలు శాంతి భద్రతల లోపాలను ఎత్తి చూపుతున్నాయి. పంజాబ్‌‌ పోలీస్‌‌ ఇంటెలిజెన్స్‌‌ హెడ్‌‌క్వార్టర్స్‌‌పై రాకెట్‌‌ గ్రైనేడ్‌‌తో దాడి, దేశ సరిహద్దు వెంట ఉద్రిక్తలతోపాటు దేశ, రాష్ట్ర భద్రతలపై ప్రభావం పడనుంది. నూతన ఆప్‌‌ ప్రభుత్వానికి ఇవి సవాళ్లుగా నిలుస్తున్నాయి. వీటిని అరికట్టడానికి రాష్ట్ర భద్రతా దళాలను సన్నద్ధం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పొందడం ఎంతో కీలకం. పంజాబ్‌‌ ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక సరిహద్దులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సహాయసహకారాలు ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. రాజకీయంగా కేంద్రంలోని బిజెపితో పోరు, పంజాబ్‌‌లో హామీలు నెరవేర్చి ఫలితాలు సాధించడానికి కేంద్రంతో సయోధ్య ‘ఆప్‌‌’కు కత్తిమీద సాము వంటిదే! బిజెపి,- కాంగ్రెస్‌‌లకు ప్రత్యామ్నాయంగా నిలవాలనుకుంటున్న ఏ ఇతర రాజకీయపార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో లేదు. ఆ ప్రత్యేకత ‘ఆప్‌‌’ కే వుంది. పైగా రేపు గుజరాత్‌‌ అసెంబ్లీ ఫలితాల తరువాత ఎన్నికల కమిషన్‌‌ ఆప్‌‌కు జాతీయ పార్టీ హోదా కల్పించడం ఖాయం. ఈ పరిస్థితుల్లో ...  ఆప్‌‌ తన భవిష్యత్‌‌ రాజకీయ విస్తరణకి పంజాబ్‌‌ ప్రయోగశాల నుంచి ఏ సక్సెస్‌‌ ఫార్ములాను తీసుకువస్తుందో కాలమే నిర్ణయించనుంది.

కేజ్రీవాల్‌‌ చేతుల్లో పాలన

రాష్ట్రంలోని మాన్‌‌ ప్రభుత్వం కేజ్రీవాల్‌‌ చెప్పుచేతుల్లో ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పంజాబ్‌‌ రాష్ట్ర నిధులను, వనరులను ఇతర రాష్ట్రాల్లో ఆప్‌‌ విస్తరణకు దుర్వినియోగపరుస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాక ముఖ్యమంత్రి మాన్‌‌ స్వతహాగా తనను తాను నిరూపించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో ఉండే పంజాబ్‌‌ రాజకీయవేత్త రాఘవ చద్దా రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఆయన ఆప్‌‌ ఢిల్లీ దర్బార్‌‌ ప్రతినిధిగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక  ప్రభుత్వం తీసుకునే ప్రధాన నిర్ణయాలపై కేజ్రీవాల్‌‌ ప్రభావం కూడా  ఉండడంతో ఈ విమర్శలకు తావిస్తున్నది. దీంతో పార్టీ పంజాబ్‌‌ నుండి పర్యావరణ, సామాజిక కార్యకర్తలు ఇద్దరిని రాజ్యసభకు నామినేట్‌‌ చేసింది.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
 పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ