మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీలను చెత్త సమస్య వేధిస్తోంది. డంపింగ్ యార్డులు లేకపోవడంతో చాలామంది చెత్తను ఎక్కడపడితే అక్కడే వేస్తున్నారు. ఫలితంగా కాలనీలన్నీ కంపుకొండుతున్నాయి. వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదమూ ఉంది.
రోజుకు 130 మెట్రిక్ టన్నుల చెత్త
మంచిర్యాల మున్సిపాలిటీలో నిత్యం 60 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. నస్పూర్లో 55 మెట్రిక్ టన్నులు, బెల్లంపల్లిలో 36 , క్యాతనపల్లిలో 21, మందమర్రిలో 35, చెన్నూరులో 17, లక్సెట్టిపేటలో17 మెట్రిక్ టన్నులు జమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ డంపింగ్యార్డులు లేకపోవడంతో సేకరించిన చెత్తను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. చాలామంది ఇండ్ల చుట్టూ ఉంటే ఖాళీ ఏరియాల్లో పడేస్తున్నారు. శానిటేషన్సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా రోడ్లవెంట చెత్తదర్శనమిస్తోంది. ఈగలు, దోమలు వృద్ధిచెందుతున్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో 1.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ వెలువడే సుమారు 60 మెట్రిక్టన్నుల చెత్త తరలించేందుకు కనీసం మూడు డంపింగ్యార్డులు అవసరం. కానీ శివారులోని అండాలమ్మ కాలనీలో ఒకటే యార్డు ఉంది. అంతకు ముందు నస్పూర్మున్సిపాలిటీ పరిధిలో నస్పూర్, మంచిర్యాల మున్సిపాలిటీలకు కలిపి యార్డు ఉండేది. ఈ యార్డును ప్రస్తుతం నస్పూర్ మున్సిపాలిటీ వారే వాడుకుంటున్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్లు అభ్యంతరం చెప్పడంతో ..
ఇటీవల ఏసీసీ క్వారీ ఏరియాలో గుట్ట దిగువన మంచిర్యాల, క్యాతన్ పల్లి మున్సిపాలిటీలకు చెరో 8 ఎకరాల చొప్పున డంపింగ్ యార్డుల కోసం స్థలాలు కేటాయించారు. అయితే అటవీ, గుట్ట ప్రాంతం కావడంతో అప్రోచ్రోడ్డు నిర్మాణం కష్టమని ఆ స్థలాలను వదిలివేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీ ఏరియాలో మున్సిపాలిటీ కోసం 10 ఎకరాల్లో రూ.3 కోట్ల వ్యయంతో డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. అప్రోచ్రోడ్డు, ఇంటర్నల్ రోడ్లు, గోడ, వర్మీ కంపోస్టు ప్లాంటు, బయోవేస్ట్ ప్లాంట్, డీఆర్సీ కేంద్రం, ఇతర గదులు ఉన్నాయి. అన్ని హంగులతో యార్డును నిర్మించినా ఫలితం లేదు. ఆ స్థలాన్ని అగ్రికల్చరల్ ప్రాసెస్ సెంటర్ కోసం కేటాయించడంతో యార్టు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మందమర్రి పట్టణ శివారు 2.2 కి.మీ దూరంలోని చతులాపూర్, కేకే3ఏ గని మధ్యలో రూ.39 లక్షల వ్యయంతో 8 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేసినా.. అటువైపు వెళ్లేందుకు మార్గంలేక ఇబ్బందులు తప్పడం లేదు. సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు అభ్యంతరం చెప్పడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు.
కొత్త మున్సిపాలిటీల్లో యార్డులు ల్లేవ్
జిల్లాలో కొత్తగా ఏర్పడిన క్యాతన్పల్లి, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేటలో డంపింగ్ యార్డులు లేవు. దీంతో కాలనీల వాసులు ఎక్కడపడితే అక్కడే చెత్తవేస్తున్నారు. రామకృష్ణాపూర్ లో మూసేసిన సింగరేణి టింబర్యార్డు ఎదుట సింగరేణి ఖాళీ స్థలం, కోల్బెల్ట్ రహదారిని పక్కన చెత్తను వేస్తున్నారు. సింగరేణి సంస్థకు వందల ఎకరాల ఖాళీ స్థలాలున్నా.. డంపింగ్యార్డు, శ్మశాన వాటికల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలేదు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జనాభా దృష్యా రామకృష్ణాపూర్, గద్దెరాగడిలో కనీసం రెండు డంపింగ్ యార్డులు అవసరం. నస్పూర్మున్సిపాలిటీలోని ముక్కిడి పోచమ్మ ఏరియాలో సింగరేణి ఖాళీ స్థలాన్ని డంపింగ్యార్డుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా మూడు యార్డులు అవసరం. చెన్నూరు మున్సిపాలిటీలోని బుద్దారం బైపాస్ రోడ్లో 10 ఎకరాల్లో రూ.1.5 కోట్ల వ్యయంతో డంపింగ్యార్డు, లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని గోదావరి ఒడ్డున ఐదు ఎకరాల్లో డంపింగ్యార్డుల పనులు జరుగుతున్నా... అవి ఎప్పుడు అందుబాటులో వస్తాయో తెల్వడంలేదు.
స్థలసేకరణ చేస్తున్నాం
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్యార్డుకు కోసం స్థల సేకరణ చేస్తున్నాం. 10 ఎకరాల స్థలం కోసం కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించాం. ఆర్కే1 మార్కెట్ ఏరియాలోని బ్రాడ్గేజ్ రైల్వే ట్రాక్ ప్రాంతంలోని స్థలాన్ని పరిశీలించాం. నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటాం.
- వెంకటనారాయణ, మున్సిపల్కమిషనర్, క్యాతన్పల్లి