- రెండు ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా
- నోటిఫికేషన్లు ఇవ్వడంతో రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే
- ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు
- ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన!
- గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం,
- జాఫర్ జావెద్కు అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్సీ పదవుల కోసం డజను మందికిపైగా నేతలు పోటీలో ఉండగా.. ఆ రెండు కేటగిరీల్లో నలుగురికి మాత్రమే అవకాశం దక్కనుంది. అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వాళ్లలో ఇద్దరిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించే చాన్స్ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ కోటాలో ఇద్దరు విద్యావేత్తలను నామినేట్ చేయనున్నట్లు సమాచారం. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గురువారం విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చింది. దీంతో అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా రెండిటికి రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ నెల 15న కానీ, 16 కానీ ప్రకటించే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే కోటా సీట్లు ఆ ముగ్గురిలో ఇద్దరికి!
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వదులుకున్న సీనియర్ లీడర్లకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం దాదాపు డజను మంది దాకా పోటీ పడుతున్నారు. అయితే, అందులో తొలుత అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అద్దంకి దయాకర్ గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్కు గట్టిపోటీనిచ్చారు. స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మందుల సామేలు కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్ పేరును ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సీనియర్ లీడర్గా ఉన్న చిన్నారెడ్డి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్ను వదులుకున్నారు. షబ్బీర్ అలీ కోసం నిజామాబాద్ అర్బన్ టికెట్ను మహేశ్ కుమార్ గౌడ్ వదులుకున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం చిన్నారెడ్డి, మహేశ్కుమార్గౌడ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు కూడా ఈ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లకు ఇప్పుడప్పుడే ఇతర పదవుల్లో అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొన్ననే అసెంబ్లీ టికెట్లు ఇచ్చి బరిలోకి దింపినందున.. కొంతకాలం వెయిట్ చేయాలని అంటున్నట్లు సమాచారం. ఇప్పుడే వారికి పదవులు ఇస్తే.. పార్టీ కోసం కష్టపడుతున్న ఇతర నేతలకు అన్యాయం చేసినట్టవుతుందని పార్టీ పెద్దలు చెప్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లుగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వదులుకున్న లీడర్లకే తొలుత చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.
గవర్నర్ కోటాలో విద్యావేత్తలకు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, విద్యారంగ నిపుణుడు జాఫర్ జావెద్ (ముఫకంజా కాలేజీ చైర్మన్)కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తునట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో రాజకీయ రంగాలకు చెందిన వాళ్లను బీఆర్ఎస్ పార్టీ నామినేట్ చేయగా.. అప్పుడు గవర్నర్ తిరస్కరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా, కళ, విద్యా తదితర రంగాల్లో ఉన్నవాళ్లకు గవర్నర్ కోటా ఎమెల్సీలుగా నామినేట్ చేయాలని చెప్పారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావెద్ పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు, త్వరలోనే అధికారికంగా వీళ్ల పేర్లను గవర్నర్కు పంపే అవకాశం ఉందని ఓ సీనియర్ లీడర్ తెలిపారు. ఇదే కోటాలో వ్యాపారవేత్త మస్కతీ అలీ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.