Kamal Haasan: శ్రీలంక తమిళులను సీఏఏలో ఎందుకు చేర్చలేదు: కమల్ హాసన్

Kamal Haasan: శ్రీలంక తమిళులను సీఏఏలో ఎందుకు చేర్చలేదు: కమల్ హాసన్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశాన్ని విభజించేందుకే సీఏఏ అమలు చేశారని కమల్ హాసన్ ఆరోపించారు. శ్రీలంక తమిళులను సీఏఏలో ఎందుకు చేర్చలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. 

ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సీఏఏను త్వరగా అమలు చేసిందని  కమల్ హాసన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చట్టం అణగారిన మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఉద్దేశించింది అయితే, శ్రీలంక తమిళులను సీఏఏ పరిధిలోకి ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించడంలో తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని ఆయన అన్నారు. తాను స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ సీఏఏని వ్యతిరేకించిందని, సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేసిన మొదటి వ్యక్తి తానేనని కమల్ హాసన్ తెలిపారు. 

"కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను విభజించి, భారతదేశ సామరస్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో,  సీఏఏని హడావుడిగా నోటిఫై చేసింది. ఈ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్ణయిస్తున్నందున.. నోటిఫికేషన్ సమయం మరింత సందేహాస్పదంగా ఉంది.." అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.