అరవింద్ కేజ్రీవాల్ మారిపోయారా? చీటికీ మాటికీ అందరిపైనా విరుచుకుపడే కేజ్రీవాల్ ఈ మధ్య సైలెంట్గా ఎందుకున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘మానసిక రోగి (సైకోపాత్)’గా, ప్రతి ఒక్క పొలిటీషియన్ని ‘అవినీతిపరుడు (కరప్ట్)’గా, తానొక్కడే ‘మిస్టర్ క్లీన్’గా భావించే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నట్టుండి ‘మర్యాదస్తుడు’గా మారిపోయారు. మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్ధాంతాన్ని… ‘చెడు అనొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు’… తుచ తప్పకుండా పాటించేస్తున్నారు కేజ్రీ! లోక్సభ ఎన్నికల వరకు ఎవరిపైనయినా ఒంటికాలిపై లేచేవారు. ఇప్పుడు మొత్తం కొత్త కేజ్రీవాల్ కనిపిస్తున్నారని ఢిల్లీ మీడియా ఆశ్చర్యపోతోంది.
నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో అక్రమంగా వెలసిన మురికివాడల్ని, కాలనీలను రెగ్యులరైజ్ చేయడానికి నరేంద్ర మోడీ సర్కారు పోయిన నెలలో నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ‘దీపావళి గిఫ్ట్’గా కేజ్రీవాల్ ఆకాశానికెత్తేశారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ‘కేంద్ర సహకారానికి ధన్యవాదాలు’ చెప్పారు. ఇలాంటివాటిని రాజకీయాలతో ముడిపెట్టకూడదన్నారు. గతంలోనైతే, కేంద్రం అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తోందన్న లెవెల్లో మండిపోయేవారు కేజ్రీ. ఢిల్లీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ప్రకటిస్తూ… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాటల్ని ప్రస్తావించారు. ‘ప్రభుత్వ సంక్షేమ కేటాయింపుల్లో 85 శాతం అవినీతిపరులు మింగేసి, కేవలం 15 శాతం మాత్రమే ప్రజలకు ఇస్తుంటారని రాజీవ్ అనేవారు. మేము అలా కాదు, 85 శాతాన్ని ఢిల్లీ ప్రజలకు దక్కేలా చూస్తున్నాం’ అన్నారు కేజ్రీవాల్.
అలాగే, ఎన్సీఆర్లో కాలుష్యాన్ని అదుపు చేయడంకోసం కేంద్ర సర్కారు చేస్తున్న ప్రయత్నాల్నికూడా మెచ్చుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ‘సరి–బేసి స్కీమ్ అమలుని ప్రెస్మీట్లో ప్రకటించారు. ఆ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లు తమను వేలెత్తి చూపకుండా సహకరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. వాహనాల నెంబర్లనుబట్టి ‘సరి–బేసి స్కీమ్’ అమలు చేస్తారు. దీనివల్ల ఒరిగేదేమీ లేదని, ఇది సగం కాలిన రొట్టెలాంటి ప్రయోగమని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈ స్కీమ్ అమలు చేసినప్పటికీ ఢిల్లీలో పొగ తగ్గలేదని, కాలుష్యం లెవెల్ 600కు మించే ఉందని అసంతృప్తి ప్రకటించి, రివ్యూ చేస్తానని తెలిపింది. అయితే, తన స్కీమ్కి సెంట్రల్ గవర్నమెంట్ సహకరించిందని కేజ్రీవాల్ చెప్పుకోవడం మీడియాని, పొలిటికల్ సర్కిల్స్ని ఆశ్చర్యంలో పడేసింది.
ఇంతకుముందయితే, మోడీ సర్కారు తీసుకున్న ఏ నిర్ణయాన్నయినా ఏకిపారేసేవారు, ఏదైనా మాట్లాడినా తప్పులు వెదికేవారు అరవింద్ కేజ్రీవాల్. తన ఆఫీసుమీద సీబీఐ రైడ్ చేసినప్పుడు మోడీని ‘పిరికివాడు, మానసిక రోగి’ అని తిట్టిపోశారు. పీఓకేలోని మిలిటెంట్ల స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించగానే… ‘ఆధారాలున్నాయా? అంతా బూటకం’ అని కొట్టిపారేశారు కేజ్రీ. లోక్సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్కోసం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో నిరసనకు దిగితే కేజ్రీవాల్ సపోర్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో శారదా చిట్ఫండ్స్ స్కాంలో అప్పటి కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ని సీబీఐ ప్రశ్నించాలనుకుంటే కూడా కేజ్రీవాల్ తప్పుబట్టారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలపై కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, మోడీ ‘పాకిస్థాన్ ప్రైమ్ మినిస్టర్’లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో తరచు కయ్యానికి దిగే కేజ్రీవాల్, ఇప్పడు చాలా సాఫ్ట్గా ఉంటున్నారు. దీపావళికి జరిపిన ఒక లేజర్ షో సక్సెస్ కావడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇచ్చిన సపోర్టే కారణమని మెచ్చుకున్నారు.
ఎదురు దెబ్బ భయమా!
దీనికి అందరూ ఊహిస్తున్న కారణం ఒక్కటే… త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగలవచ్చనే భయం. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, చండీగఢ్, బీహార్, గోవా, పంజాబ్, అండమాన్ నికోబార్ దీవులు, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్ల్లో ఆప్ మొత్తం 40 మంది కేండిడేట్లను దించింది. కానీ, పంజాబ్లోని సంగ్రూర్ నుంచి ఒకే ఒక్క ఎంపీ భగవంత్ మాన్ గెలిచారు. అయితే, ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లోనూ దక్షిణ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. 2014 ఎన్నికల్లో పంజాబ్ నుంచి నలుగురు గెలిచి, లోక్సభలో ఆప్ ఎంపీలుగా అడుగుపెట్టారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో 67 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత గోవా, గుజరాత్, హర్యానా అసెంబ్లీలకు పోటీ చేసినా ఒక్క చోటా గెలవలేదు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బే తగిలింది.
ఈ లెక్కలన్నీ కేజ్రీవాల్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశాయంటున్నారు ఎనలిస్టులు. అదీగాక, ఆయన తరఫున గట్టిగా వాదించి, నిలబడేవాళ్లుకూడా ఎవరూ మిగల్లేదంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఎదుగుదలలో సహకరించిన యోగేంద్ర యాదవ్, అరుణారాయ్, మేధా పాట్కర్, కుమార్ విశ్వాస్, కిరణ్ బేడీ, అధికార ప్రతినిధి అశుతోష్ వంటివాళ్లంతా ఆ తర్వాత రోజుల్లో ఆయనకు దూరమయ్యారు. ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన కపిల్ మిశ్రా, అల్కా లాంబ… కేజ్రీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించి, ఇతర పార్టీల్లో చేరిపోయారు. మరో మూడు నెలల్లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలో అసంతృప్తిని పెంచుకుంటూ పోవడం, అన్ని పార్టీలనూ ఏదోక రకంగా అవమానించడం మంచిది కాదని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కాలంలో జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో జత కట్టడానికి పెద్ద పార్టీలేవీ ముందుకు రాకపోవడాన్ని ఎనలిస్టులు గుర్తు చేస్తున్నారు.
మితిమీరిన ఆత్మవిశ్వాసం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పెట్టిన కొత్తలో అరవింద్ కేజ్రీవాల్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు సాధించి పెద్ద పార్టీగా నిలబడింది. బీజేపీ, కాంగ్రెస్లకు కూడా ఫుల్ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. ఎన్సీఆర్ వరకు జన లోక్పాల్ బిల్లు పెట్టాలనుకుంటే ఏ ఒక్కరూ సహకరించలేదు. దాంతో 49 రోజులకే సీఎం పోస్టును వదిలేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లలో ఆప్ ఒక్కటీ గెలవలేకపోయినా, సెకండ్ ప్లేస్లో నిలవగలిగింది. 2015లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 70 సీట్ల అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించారు ఢిల్లీ ఓటర్లు. దీంతో ఆయన కాన్ఫిడెన్స్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.