
బెంగళూరు: కంపెనీలో పనిచేస్తున్న 2.50 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రెయినింగ్ ఇవ్వనున్నట్లు విప్రో బుధవారం ప్రకటించింది. ఈ ట్రెయినింగ్ కోసం బిలియన్ డాలర్లు (రూ.8,200 కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపింది. క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, కన్సల్టింగ్ అండ్ ఇంజినీరింగ్ టీములలోని 30 వేల మంది ఉద్యోగులను ఒక గొడుగు కిందకి తేనున్నట్లు కూడా విప్రో ప్రకటించింది. ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువను ఎకానమీకి జోడించే సామర్ధ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందని వివరించింది. ఉద్యోగుల కోసం ఏఐ కరిక్యులమ్ రూపొందించనున్నట్లు పేర్కొంది. జెన్ఏఐ సీడ్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ కూడా తేనున్నట్లు వెల్లడించింది. విప్రో ఏఐ360 పేరుతో ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తోందని విప్రో మేనేజింగ్ డైరెక్టర్ థీరీ డెలాపోర్ట్ ఈ సందర్భంగా చెప్పారు.